పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో లో దొంగల బీభత్సం

పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో లో దొంగల బీభత్సం

ముద్ర, పెబ్బేరు : గురువారం అర్ధరాత్రి, తెల్లవారితే శుక్రవారం నాడు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో గుర్తు తెలియని దుండగులు దుకాణాల షట్టర్లను రాడ్లతో పైకి లేపి భారీ మొత్తంలో చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. 6 లక్షల దాకా దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పెబ్బేరు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డుకు చెందిన దుకణాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. నవీన్ కుమార్ రెడ్డికి చెందిన కిరాణా షాపులో రూ. 2.50లక్షలు, తులం బంగారం, జగన్మోహన్ రెడ్డికి చెందిన శ్రీరామా ట్రేడర్స్ లో రూ. 2లక్షలు, అజయ్ కుమార్కు చెందిన శ్రీరామ మెడికల్ షాపులో రూ.50వేలు, కమలాకర్ రెడ్డికి చెందిన కిరాణా షాపులో రూ.25వేల – రూ.30వేల దాకా నగదు, సిగరెట్లు దొంగతనానికి గురయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు.

షట్టర్లను విరగొట్టి గుణపాలు, పెద్ద రాడ్ ల సహాయంతో పైకి లేపి దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించారు. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, డీఎస్పీ ఆనంద్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.