ఏపీలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలు
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలియజేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్.. ఐటీ, ఎలక్ట్రానిక్ సెక్టార్లో మూడు కాన్సెస్ట్ సిటీలు.. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలపై ఫోకస్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటికే కొంత ఎకోసిస్టమ్ డెవలప్ అయిందని.. రాష్ట్రంలో మేజర్ ఐటీ డెస్టినేషన్గా ఉందని చెప్పారు. విశాఖతో పాటు చెన్నైకి దగ్గరగా ఉన్న తిరుపతిలో, బెంగళూరుకు దగ్గరగా ఉన్న అనంతపురంలలో కూడా ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు. మిగిలిన పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద సముద్రతీరం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీని అమల్లోకి తీసుకోస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయని చెప్పారు.