తెలంగాణ తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ తిరుపతిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Minister Srinivas Goud
  • వచ్చే ఏడాది నాటికి రోప్ వే నిర్మాణం పూర్తి
  • మన్యంకొండలో ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం
  • పెద్ద ఎత్తున కళ్యాణ మండపాలు నిర్మిస్తాం
  • మన్యంకొండ అభివృద్ధి ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, ముద్ర ప్రతినిధి 04: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతి గాంచిన 800 ఏళ్ల చరిత్ర ఉన్న మన్యం కొండ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు,  యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మన్యంకొండ ఆర్చీ నుంచి దేవాలయం వైపు రూ. 4.79 కోట్ల వ్యయంతో సర్వాంగ సుందరంగా నిర్మించిన బీటి డబుల్ రోడ్డు, డబుల్ రోడ్డు వెంట రూ. 52 లక్షల వ్యయంతో వేసిన సెంట్రల్ లైటింగ్, దేవాలయం ముఖ ద్వారం వద్ద రూ. 27.65 లక్షలతో నిర్మించిన చెరువు కట్ట అభివృద్ధి పనులు మరియు స్నాన ఘట్టాన్ని, భక్తుల సౌకర్యార్థం రూ.2.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 18 వసతి గృహాల సముదాయాన్ని ప్రారంభించారు. 

అనంతరం దేవాలయం పరిసరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడి మీడియాతో మాట్లాడారు...  దేవాలయ శాఖలో అత్యుత్తమ గ్రేడ్ ఉన్న మన్యంకొండ దేవాలయాన్ని ఏటా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ స్నానాల కోసం ఘాట్, వసతి గృహాలు నిర్మించామని వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి రాష్ట్రంలో తొలిసారిగా ఇక్కడే రూప్ వే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఒకేసారి అనేక పెళ్లిళ్లు చేసేలా కళ్యాణ మండపాలు నిర్మిస్తామన్నారు. దిగువన అలివేలు మంగ దేవాలయం సమీపంలో నిర్మించే త్రీ స్టార్ హోటల్ భక్తులు పర్యాటకులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుందన్నారు. తెలంగాణ తిరుపతిని అత్బుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

వంశపాంపర్యంగా అలహరి కుటుంబం దేవాలయాన్ని  కాపాడుతూ వస్తున్నారని మంత్రి తెలిపారు. 10 లక్షల మొక్కలు నాటి దేవాలయ, అటవీ భూములను కాపాడుకుంటామని, ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మోత్సవాలకు అద్భుతంగా ఏర్పాటు చేసిన దేవాలయ పాలకమండలి సభ్యులను, అధికారులను మంత్రి అభినందించారు. భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని మంత్రి కోరారు. జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, మన్యం కొండ దేవాలయం ధర్మకర్త మధుసూదన్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు,  వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ చంద్రకళ, నాయకులు రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, దేవాలయ పాలకమండలి సభ్యులు ఉన్నారు.