కర్ణాటక కాంగ్రెస్ దేనా
![కర్ణాటక కాంగ్రెస్ దేనా](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d23c1f1c63b.jpg)
కర్ణాటక రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. మరో వంక అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, హంగ్ విూద ఆశలతో జేడీఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నాయకులు, ఇప్పటికే ఒకటి రెండు మార్లు రాష్ట్రంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి సిద్దామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్’ వర్గాల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా ఒక కొలిక్కి రాక పోయినా ఎవరికి వారుగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో ఆయన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వ్యూహ రచన చేస్తున్నారు. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిలో పడ్డారు. అలాగే బీజేపీ మాజీ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ భారాస కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే ఎన్నికల ఫలితాలపై ఊహగానాలు, వ్యూహాగానాలతో పాటుగా వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ప్రీ పోల్ సర్వేల ఫలితాలు కర్ణాటకలోనే కాకుండా, తెలంగాణలోనూ ఆసక్తిని కల్గిస్తున్నాయి. కాగా ఇంత వరకు వచ్చిన అన్ని సర్వేలు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం అయ్యే పని కాదని, ఈ సారి అధికారం హస్తం పార్టీదేనని అంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా హస్తనిదే అధికారమని అంటోంది. రానున్న కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే అంచనా వేసింది. 224 స్థానాల్లో బీజేపీకి కేవలం 65 నుంచి 75 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 108 నుంచి 114 స్థానాలు, జేడీఎస్కు 24 నుంచి 34 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.కర్ణాటకలోని ఐపీఎస్ఎస్ టీమ్తో కలిసి నవంబరు 20 నుంచి జనవరి 15 వరకు ఈ సర్వేను నిర్వహించినట్లు హైదరాబాద్కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని, బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని వెల్లడైందని తెలిపింది.
కాంగ్రెస్కు పడే ఓట్లు 38.14 శాతం నుంచి 40 శాతానికి, అంటే 1.86 శాతం పెరుగుతాయని తెలిపింది. బీజేపీకి పడే ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి, అంటే 2.35 శాతం తగ్గుతుందని తెలిపింది. జేడీఎస్ కూడా 1.3 శాతం మేరకు ఓట్లను కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చిన్న పార్టీలు, స్వతంత్రులు ఏడు స్థానాలను దక్కించుకోవచ్చునని అంచనా వేసినట్లు పేర్కొంది.వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల నుంచి కాంగ్రెస్ గరిష్ఠ మద్దతు పొందుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఒక్కళిగ కులస్థుల్లో 50 శాతం మంది జేడీఎస్ను బలపరిచే అవకాశం ఉందని, వీరిలో 38 శాతం మంది కాంగ్రెస్కు, 10 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉందని పేర్కొంది.గంగావతి, బళ్లారి, కోలార్, దావణగేరే, రాయ్చూరులలో అభ్యర్థుల గెలుపోటములపై గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది.
ఏఐఎంఐఎం పోటీ చేస్తే కేవలం ఆరు లేదా ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపించగలదని అంచనా వేసింది.మరో వంక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీలోని 224 సీట్లకు కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసే విషయంపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజా ధ్వని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోస్టల్ కర్ణాటకను హిందుత్వ లేబొరేటరీగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమాజాన్ని విడగొట్టేందుకు హిందుత్వ పేరుతో అబద్ధాలను బీజేపీ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైనవని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ మత ప్రసక్తి లేకుండా ప్రజలంతా కలిసిమెలసి ఆప్యాయానురాగాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని, బీజేపీకి అభివృద్ధి అంశాల కన్నా ‘లవ్ జీవాద్’ అశంపైనే మక్కువ ఎక్కువ అని ఆన్నారు. బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలు గ్రహించాలని సూచించారు.