పొంగులేటితో వెళ్లేదెవరు?

పొంగులేటితో వెళ్లేదెవరు?

చైతన్యవంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కమ్యూనిస్టుల కంచుకోటగా రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు అటు పార్టీలకు తలనొప్పిగా మారగా ఇటు నాయకులకు అంతగా కలిసి రావడం లేదు. గత నాలుగేళ్లుగా పదవులు లేకపోయినా పార్టీలో ఉన్న పొంగులేటి అన్ని నియోజకవర్గాల్లో సొంత నేతలకు తలనొప్పిగా మారారు. తనకంటూ ప్రత్యేక క్యాడర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, పొంగులేటి వర్గానికి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం క్రమంగా పొంగులేటి ప్రాధాన్యత తగ్గించిందని టాక్‌. తనకు మునుపటి పరిస్థితులు పార్టీలో వస్తాయని భావించిన పొంగులేటి ఇప్పటి వరకు వేచి చూశారు. పరిస్థితులు మారకపోగా... తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగిపోయాయి. దీంతో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తన అనుచరగణంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పార్టీ మారేందుకు సిద్దమైనట్లు సంకేతాలు ఇచ్చారు పొంగులేటి. తనతో వచ్చేవారికి పోటీ చేసే అవకాశం ఉంటుందనీ, ప్రజాప్రతినిధులుగా అయ్యే ఛాన్స్‌ వస్తుందని పరోక్షంగా అనుచరగణానికి సంకేతాలు ఇస్తున్నారు. అయితే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పొంగులేటికి ఇప్పుడు తన అనుచరగణం నుంచే వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ. దీంతోపాటు ఇప్పటి వరకు పొంగులేటితో ఎక్కువగా దళితులు, మైనారిటీలు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా ఫాలో అయ్యారు. పొంగులేటి తొలుత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. దీని కారణంగా వైఎస్సార్‌ అభిమానులు ఎక్కువగా ఆయనతో కలిసి ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి కమల దళంలో చేరేందుకు సిద్ధమైన తరుణంలో స్థానికంగా తమకు పరిస్థితులు అనుకూలంగా మారబోవని భావిస్తోంది ఆయన అనుచరగణం. అందుకే ఆయనతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్‌.

పొంగులేటి రాజకీయ అరంగ్రేటం చేసిన నాటి నుంచి ఆయనతోపాటే నడిచిన సత్తుపల్లి నాయకుడు ఇప్పటికే తాను కలిసి రాలేనని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. పినపాక నియోజకవర్గానికి చెందిన నాయకుడు సైతం ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు సైతం తాము కలిసి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నట్లు వినికిడి. ఇప్పటి వరకు రాజకీయాలతో కళకళలాడిన పొంగులేటి క్యాంప్‌ కాస్తా నిరాశజనకంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జననబలం లేకుండా ఉన్న నాయకులు పొంగులేటితో నడిచేందుకు సిద్ధమవుతారని, జనంలో బలంగా ఉన్న నాయకులు ఆయనతో వెళ్లరనే ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఉన్న అనుచరులు పార్టీ మారేందుకు కలిసి రామనే విషయం పొంగులేటి వర్గంలో చర్చానీయాంశంగా మారింది. మరి పొంగులేటి పార్టీ మారితే ఆయనతోపాటు ఎవరు వెళతారనేది మాత్రం వేచి చూడాల్సిందే.తన రాజకీయ భవిష్యత్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు పొంగులేటి. ఒక వైపు కమలం గూటికి వెళ్లాలనే ఉన్నా... అనుచరులు అత్యధికులు ఆసక్తి చూపకపోవడం ఒక ఎత్తైతే, ఖమ్మం జిల్లాలో మూడే జనరల్‌ సీట్లు ఉన్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలంటే పాలేరు, ఖమ్మం, కొత్తగూడెంలో ఎక్కడ నుంచో పోటీ చేయాలి. పాలేరు ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేల కందాళ ప్రభాకర్‌ రెడ్డికి మళ్లీ టిక్కెట్‌ గ్యారెంటీ అని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ గట్టిచెబుతున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేస్తానని ఆత్మీయులతో చెబుతున్నారు మాజీ మంత్రి, పాలేరు మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్ష్యురాలు వైఎస్‌ షర్మిల కూడా పాలేరు నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఇక్కడ పొంగులేటి బరిలోకి దిగితే ఏంటీ పరిస్థితి అని అంచనా వేస్తున్నారు. ఖమ్మంలో పోటీ చేయాలంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌ గట్టి పోటీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్‌ నుంచి సీనియర్లే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఖమ్మం అసెంబ్లీలో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. పువ్వాడ అజయ్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. కొత్తగూడెంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ టిక్కెట్‌ కోసం అధికార పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. అక్కడ కమ్యునిస్టుల ప్రభావం ఎక్కువ. ఇక్కడ కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు నాగేశ్వరరావు కుమారుడు కోనేరు చిన్ని కర్చీఫ్‌ వేసుకొని కూర్చుకున్నారు. సో ఈ మూడు సీట్లలో ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది ముందు పొంగులేటి తేల్చుకోవాలి. ఎంత మంది తనతోపాటు వస్తారు? వారిని ఏ విధంగా గెలిపించుకుంటారో చూడాలి. పొంగులేటి ఏ గట్టున ఉంటారనేదానిపైనే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మంజిల్లా రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.