గవర్నర్‌ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎందుకు పెట్టించలేకపోయారు?

గవర్నర్‌ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎందుకు పెట్టించలేకపోయారు?

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని పీఏసీ ఛైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.  సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు.. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం దాన్ని ఎందుకు పెట్టించలేకపోయారని ఆయన నిలదీశారు. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పయ్యావుల మీడియాతో మాట్లాడారు.  గవర్నర్‌ ప్రసంగంలో సీఎంను పొగిడించడమేంటని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రానికి గవర్నర్‌ పెద్దా? సీఎం పెద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన గవర్నర్‌తో సీఎంను పొడిగించి ఆయన స్థాయిని తగ్గించారని ఆక్షేపించారు. శాంతిభద్రతల అంశం ప్రసంగంలో ఎక్కడా లేదని చెప్పారు. స్పీకర్‌ కార్యాలయంలో గవర్నర్‌ వేచి ఉండేలా చేశారని.. ఇది సభా నిబంధనలకు విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గవర్నర్‌తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల ఆరోపించారు.