నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు

నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు

రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజ మహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజక వర్గాలతో పాటు భువనేశ్వరి దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన కొమరవోలు గ్రామస్తులు గురువారం రాజ మహేంద్రవరంలో ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో తాము ఎంతో మనో వేదనకు గురయ్యామని, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయాన్ని భువనేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నాయన్నారు. నిత్యం రాష్ట్రం కోసం శ్రమించే చంద్రబాబును జైలు లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూతమకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. త్వరలోనే చంద్రబాబు విడుదలై మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తారని భువనేశ్వరి అన్నారు.

భువనేశ్వరిని కలిసిన పార్టీ సీనియర్ నేతలు

నారా భువనేశ్వరిని పలువురు టీడీపీ సీనియర్ నేతలు గురువారం కలిశారు. మాజీ మంత్రులు, యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, కె.ఎస్. జవహర్ భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు ఆమెకు వివరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తన కుటుంబ సభ్యులతో భువనేశ్వరిని కలిశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నాయకులతో కలిసి భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ లో జరుగుతున్న నిరసనలను వివరించారు.