గుడ్ న్యూస్ - ఎన్నికల కోడ్ ముగియగానే జీరో కరెంటు బిల్లులు...
![గుడ్ న్యూస్ - ఎన్నికల కోడ్ ముగియగానే జీరో కరెంటు బిల్లులు...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665d9284ac4af.jpg)
ముద్ర,తెలంగాణ:-రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచే గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే 6వ తేదీ నుంచి బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వినియోగదారులకు ఈ నెల 1వ తేదీ నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలైనందున, గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా రంగారెడ్డి జోన్ పరిధిలోకి వచ్చే సైబరాబాద్, రాజేంద్రనగర్, సరూర్నగర్ సర్కిళ్లలో గృహజ్యోతి పథకం అమలు కాలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఆహారభద్రత కార్డు కలిగిన అర్హులు 4 లక్షల పైనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల్లో 12 లక్షల మంది ఆహారభద్రత కార్డు కలిగిన వారున్నారు. వీరందరికి సున్నా బిల్లులు జారీ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చాలా మందికి అందలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోగా కోడ్ రావడంతో వారికి ఈ పథకం ఫలితం పొందలేకపోయారు. వీరందరికీ ఈ నెల 6వ తేదీ నుంచి సున్నా బిల్లులు జారీ కానున్నాయి.
ఈ పథకాన్ని ఫిబ్రవరి 27న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పథకం అమలు అయిన తొలి రోజుల్లో సాంకేతిక కారణాల వల్ల 200 యూనిట్లులోపు ఉన్న వారికి కూడా బిల్లు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరికైతే బిల్లులు వచ్చాయో వాటిని ఆధారంగా చేసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హామీ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని వేరే బిల్లులు వచ్చే లోపు ఎన్నికల కోడ్ వచ్చింది. వారికి గృహజ్యోతి స్కీమ్ అమలు అవ్వలేదు. అలాంటి కుటుంబాలకు కూడా కోడ్ ముగియగానే(ఈ నెల 6వ తేదీ నుంచి) సున్నా బిల్లులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు వెల్లడించారు.