భట్టి విక్రమార్క పాదయాత్ర - Day 82

భట్టి విక్రమార్క పాదయాత్ర - Day 82

మర్లపాడ్ తండా, అచ్చంపేట నియోజకవర్గం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం అచ్చంపేట  మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న సందర్భంగా రోడ్డు పక్కనే గ్రామస్తులు మూడవత్ రెడ్యానాయక్, హనుమంతు నాయక్, బొజ్యానాయక్, జగన్ నాయక్, సత్య నాయక్, రాంలీ నాయక్, రమేష్  ఎదురొచ్చి   దండం పెట్టి భట్టి విక్రమార్కకు స్వాగతం పలికారు.

నక్కల గండి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద తమ భూములు కోల్పోతే అక్కడి నుంచి ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని వచ్చి గుడిసెలు వేసుకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  రెడ్యానాయక్ మాట్లాడుతూ నక్కలగండి ప్రాజెక్టు కింద 20 ఎకరాల భూమి మునిగిపోతే వారు ఇచ్చిన పరిహారం డబ్బులకు ఇక్కడ నాలుగు ఎకరాలు మాత్రమే వచ్చిందని, భూమి కొనుగోలు చేసుకొన్న ఇక్కడనే గుడిసెలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద తమకు ఎలాంటి పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాలికి బల బల, వానకు వల వల, ఎండకు ఎండిపోతున్నామని వారి గుడిసెలను చూపిస్తూ కన్నీరు మునీరుగా విలపించారు. ఇదీలా ఉండగా మన్నెవారిపల్లి గ్రామ శివారులో నక్కలగండి ప్రాజెక్టులో మా అందరికీ సంబంధించిన 40 ఎకరాల భూమి మునిగిపోయింది. తాత, ముత్తాతల నుంచి 105 సంవత్సరాలుగా ఆ భూమిలో కాస్తులో మేమే ఉన్నాం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల మా భూములు గోవింద్ రెడ్డి పేరుపైన రావడంతో ఆయన వారసులు వచ్చి మా భూమి అంటూ కేసులు వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కెసిఆర్ సారు ధరణీ తెచ్చి మా నోట్లు మన్ను కొట్టిండు. కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళం మాకు ఈ కేసులు అంటే ఏంటో తెలియదు. మా భూములు మాకు ఇప్పించండి అంటూ భట్టి విక్రమార్కను చేతులు పట్టుకుని బోరున విలపించారు.