కేసులు రాజకీయ ప్రేరేపితం
![కేసులు రాజకీయ ప్రేరేపితం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64fd7df4520d8.jpg)
- స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం అలానే ఉంది
- చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
- ఎన్ సీబీతరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా
- ఉదయం నుంచి సుదీర్ఘ వాదనలు
- రిమాండ్ విధిస్తారా? తిరస్కరిస్తారా? అనే విషయంపై ఉత్కంఠ
ముద్ర, తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో కేసులు రాజకీయ ప్రేరేపితమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యాఖ్యానించారు. ఆదివారం చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టులో న్యాయవాది సిద్ధార్ద లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబును ఇరికింటే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేసి ఆయన హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జరిగిన సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి చంద్రబాబు ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30 గంట వరకు విచారణకు కోర్టు బ్రేక్ ఇచ్చింది. అనంతరం వాదనలు కొనసాగనున్నాయి. కాగా, చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా? తిరస్కరిస్తారా.? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏసీబీ కోర్టు లోపల, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది.
పెళ్లిరోజుకు ముందురోజే అరెస్టు
ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్ఇరోజు. సరిగ్గా 1981 సెప్టెంబర్ 10న మద్రాస్ నగరంలో వారి వివాహం జరిగింది. పెళ్లిరోజుకు ఒక్కరోజు ముందు స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేయడం గమనించదగ్గ విషయం.