మరణించిన సహచరుడి కుటుంబానికి క్లాస్మేట్స్ అండ.. 30 వేల రూపాయల ఫిక్స్ డిపాజిట్ అందజేత

మరణించిన సహచరుడి కుటుంబానికి క్లాస్మేట్స్ అండ.. 30 వేల రూపాయల ఫిక్స్ డిపాజిట్ అందజేత

కేసముద్రం, ముద్ర: పదో తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న సహచరుడు అకాల మృత్యువాత పడటంతో ఆ కుటుంబానికి క్లాస్మేట్స్ కలిసి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న 2000-2001 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పప్పుల మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మహేందర్ మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తలా కొంత పోగేసి 30 వేల రూపాయలను మహేందర్ కుమార్తె స్పందన పేరుపై పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ పత్రాలను మహేందర్ భార్య ఉమ, కుమారుడు జస్వంత్, కుమార్తె స్పందనకు శుక్రవారం అందజేశారు. స్పందనకు 18 ఏళ్ళు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన సొమ్ము వడ్డీతో కలిపి చేతికి అందుతుందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2000-01 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు శ్రీరామ్ చందర్, రాజు, సలీం, యాకన్న, శీను, కుమారస్వామి, కవిత పాల్గొన్నారు.