సీఎం పర్యటన నిరాశ పర్చిందన్న బీజేపీ

సీఎం పర్యటన నిరాశ పర్చిందన్న బీజేపీ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటన  జిల్లా వాసులను నిరాశను మిగిల్చిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు నయా పైసా మంజూరు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంకు నిధులు మంజూరు చేసే కేసీఆర్ మంచిర్యాల పట్ల ఎందుకు వివక్ష చూపారని ఆయన నిలతీశారు. మంచిర్యాల జిల్లా పేరు ఉచ్చరించడానికి కేసీఆర్ మనసు అంగీకరించలేదని విమర్శించారు. చివరకు ఎమ్మెల్యేల పేర్లను కూడా బహిరంగ సభలో పలకకపోవడం దారుణం అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని ఉద్ధరిస్తానని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ హయాంలోనే బొగ్గు గనులు ప్రైవేటు అయ్యాయని అన్నారు. సింగరేణి సంస్థను బిజెపి నిరంతరం కాపాడుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఇతర నేతలు పాల్గొన్నారు.