తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

ముద్ర. వీపనగండ్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధిలోని సంగినేనిపల్లిలో ఎన్నికల ప్రచార రోడ్ షో ను నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కొల్లాపూర్ ప్రజలకు కెసిఆర్ కు అమ్ముడుపోయే నాయకులు కావాలా లేక కొల్లాపూర్ ఆత్మ గౌరవం కోసం కెసిఆర్ పై పోరాడే నాయకులు కావాలా అని ప్రశ్నించారు.హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిపిస్తే మూడు నెలలకే అమ్ముడుపోయారు అని అలాంటి ఆణిముత్యం కొల్లాపూర్ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని అన్నారు.నీళ్లు నిధులు నియామకాలు అంటూ  తెలంగాణ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడని, దళితులకు మూడెకరాల భూమి, లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసారని విమర్శించారు.రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు వివరించారు, కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, మోహన్, చిన్నారెడ్డి,వీరయ్య తదితరులు ఉన్నారు.