దండేపల్లి లో కాంగ్రెస్ నేతల ఆమరణ దీక్ష

దండేపల్లి లో  కాంగ్రెస్ నేతల ఆమరణ దీక్ష
  • గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇవ్వాలని   డిమాండ్
  • పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  దండేపల్లి మండలం లోని గుడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మంగళవారం రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ సూచనల మేరకు ఆమరణ దీక్ష చేపట్టారు. ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ముందస్తు గా ప్రకటిస్తే పోలీస్ లు అరెస్టు చేస్తారనే ఉద్దేశ్యంతో  దీక్ష ఆరంభించిన  అనంతరం ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తరచు పైపు లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని అన్నారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు గడ్డం త్రిమూర్తులు అన్నారు. వీధిలోని స్థితిలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధికారులు, పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. దండేపల్లి జడ్.పిటీసీ గడ్డం నాగరాణి, రైతులు పాల్గొన్నారు.