గౌలిగూడ అందరికీ తెలుసు కానీ 'గౌలీ'లకు గుర్తింపు లేకుండే...

గౌలిగూడ అందరికీ తెలుసు కానీ 'గౌలీ'లకు గుర్తింపు లేకుండే...
  • గౌలీలను బీసీ జాబితాలో చేర్చిన ఘనత మాదే
  • లక్ష్మమ్మ దేవాలయం అభివృద్ధి కోసం రూ.45 లక్షల నిధులు
  • లక్ష్మమ్మ దేవాలయంలో గౌలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా మంగళ హారతికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్: జూలై11:హైదరాబాద్ నగరంలో ఉన్న గౌలిగూడ అంటే తెలంగాణ, ఏపీలో తెలియని వారుండరని... కానీ గౌలి కులస్తులకు సమైక్య రాష్ట్రంలో గుర్తింపే కష్టంగా ఉండిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న గౌలి కులస్తులకు బీసీ జాబితాలో చోటు లేక వారి పిల్లలు చదువుకునేందుకు కూడా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించి... గౌలి కులాన్ని బీసీ జాబితాలో చేర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయామని తెలిపారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్ట, లక్ష్మమ్మ దేవాలయంలో గౌలి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా మంగళ హారతి కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రసంగించారు... వందల ఏళ్ల చరిత్ర ఉన్న గౌలీ సమాజానికి సమైక్య రాష్ట్రంలో గుర్తింపు లేకపోవడం బాధాకరం అని అన్నారు. తాను మంత్రి అయ్యాక వీరి సమస్యపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బీసీ జాబితాలో చేర్చామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఎంబీసీ కులాలలో ఉన్న గౌలి సమాజానికి ఒక కమ్యూనిటీ భవనాన్ని కూడా నిర్మించినట్లు మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గౌలి సమాజం ఆధ్వర్యంలో ఉన్న లక్ష్మమ్మ దేవాలయానికి షెడ్డు నిర్మాణం కోసం గతంలోనే నిధులు అందజేశామని తెలిపారు. ప్రస్తుతం దేవాలయం నిర్మాణం మరియు షెడ్ విస్తరణ కోసం రూ.45 లక్షల నిధులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. పేద గౌలి కుల ప్రజలకు ఉచితంగా వివాహాలు జరుపుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో గౌలి కులానికి గుర్తింపు లేదని, కనీసం జానెడు జాగా కూడా ఇవ్వలేదని తెలిపారు. అన్ని కులాలు, మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ కౌన్సిలర్లు గోవిందు, చిన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరి, శంకర్, గౌలి సమాజం నాయకులు గౌలివీరు, కిషోర్, అంబన్, వెంకట్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.