బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్

బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్
  • 50 మంది విద్యార్థులకు అస్వస్థత
  • తీవ్ర అస్వస్థతతో బాలికలకు కడుపునొప్పి.. విరేచనాలు, వాంతులు
  • మంచాల మండల కేంద్రంలోని ఘటన
  • విద్యార్థినులను ఆసుపత్రికి తరలింపు.. ఆరుగురి పరిస్థితి ఆందోళనకరం

ఇబ్రహీంపట్నం, ముద్ర: కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మంచాల మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. సుమారుగా 50 మంది విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థతతో కడుపునొప్పి.. విరేచనాలు, వాంతులు అయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న మంచాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. మంచాల మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో సుమారు 96మంది విద్యార్థులు నివాసం ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. కాగా వీరికి గత మూడు రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని హాస్టల్ ఇన్చార్జి వార్డెన్ సరిత, వర్కర్ల దృష్టికి తీసుకుపోయారు. అయినా వారు పట్టించుకోలేదు. విద్యార్థులు చేసేది లేక అదే భోజనాన్ని తీసుకున్నారు. శనివారం ఉదయం సైతం అదే విధంగా అన్నంలో పురుగులు రావడంతో ఆకలితో కొంతమంది విద్యార్థినిలు తినగా, మరికొంత మంది తమ ప్లేట్లో పెట్టుకున్న భోజనాన్ని పక్కకు పడేశారు. ఈ క్రమంలో పురుగులు వస్తున్నాయని తెలిసినప్పటికి.. ఆకలికి తట్టుకోలేక పురుగులు తీసి అన్నం ను తిన్నారు. దాంతో పురుగుల అన్నం తిన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు రావడం ప్రారంభమైంది. అయితే ప్రతిరోజు పక్కనే ఉన్న పాఠశాలలో ప్రార్థనా సమయానికి హాస్టల్ విద్యార్థులందరూ చేరుకునేవారు. అయితే శనివారం పాఠశాలలో ప్రార్థన సమయం కావస్తున్న హాస్టల్ విద్యార్థినిలు ఒక్కరు కూడా పాఠశాలలకు చేరుకోలేదు. దాంతో పాఠశాల ఉపాధ్యాయులు హాస్టల్ వద్దకు చేరుకొని వాకబ్ చేశారు. ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరు పాఠశాలకు ఎందుకు రావడం లేదని గేటు బయట ఉన్న విద్యార్థినిలను ప్రశ్నించగా గత మూడు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఈ రోజు కూడా అదే విధంగా రావడం వల్ల తిన్న తోటి విద్యార్థినిలకు వాంతులు కావడంతో హాస్టల్లోనే పడుకుండిపోయారని సమాచారం ఇచ్చారు. దాంతో అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినిలను పాఠశాల ఉపాధ్యాయులు తమ కార్లలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినిల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

చెట్లపై ఉన్న పురుగులే కారణం : వార్డెన్ సరిత

హాస్టల్ విద్యార్థులు తమ ప్లేట్లో అన్నం పెట్టుకున్న తర్వాత చెట్ల కింద కూర్చొని తింటున్నారని, ఆ చెట్లపై ఉన్న పురుగులు పడడం వల్లనే అస్వస్థకు గురైనట్లు హాస్టల్ ఇన్చార్జి వార్డెన్ సరిత విలేకరులకు తెలిపారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని మరి కొంతమందికి విద్యార్థులను నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు