గాజువాక దంపతుల సెల్ఫీ వీడియో.. కథ విషాదాంతం

గాజువాక దంపతుల సెల్ఫీ వీడియో.. కథ విషాదాంతం

తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిన దంపతుల కథ విషాదాంతమైంది.  విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని తిరుమనగర్‌కు చెందిన వరప్రసాద్‌ (47), మీరా (41) మృతదేహాలు అనకాపల్లి జిల్లా రాజుపాలెం సమీపంలోని కొప్పాక ఏలేరు కాల్వలో లభ్యమయ్యాయి. 'మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా... పిల్లలూ పట్టించుకోకండి' అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతులు దాన్ని బంధువులకు పంపి, వారు కనిపించకుండా పోయారు. కుమారుడు కృష్ణతేజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల ఫోన్‌ సిగ్నల్‌ చివరిసారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువ వద్ద చూపించడంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో పని చేస్తున్న చిత్రాడ వరప్రసాద్‌, మీరా దంపతులు 87వ వార్డు తిరుమలనగర్‌ సమీపంలోని శివాజీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహమైంది. కుమారుడు బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. వరప్రసాద్‌, మీరా ఆత్మహత్య చేసుకుంటున్నామని విలపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని, దాన్ని సోమవారం సాయంత్రం బంధువులకు పంపారు. ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి వెళ్లిపోయారు. దీనిపై కృష్ణసాయితేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతుల ఫోన్‌ సిగ్నల్‌ చివరిసారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువ వద్ద చూపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. కాలువ గట్టున వారి చెప్పులు, చేతి సంచి, ఇతర వస్తువులు గుర్తించారు. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో కాలువలో గాలించారు. రాత్రి వరకూ ఆచూకీ లభించలేదు. తిరిగి బుధవారం ఉదయమూ గాలింపు కొనసాగించడంతో మృతదేహాలు లభ్యమయ్యాయి. వరప్రసాద్‌ అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో ఇటీవల రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.