విశాఖలోని రుషి కొండ ప్యాలెస్ నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు

విశాఖలోని రుషి కొండ ప్యాలెస్ నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు

రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించారు. ఇప్పటివరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడా రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు.

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని వెల్లడించారు. 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని గంటా ఆరోపించారు. రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించామన్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు.

దీన్ని హోటల్ మాదిరిగా వినిగించుకునే అవకాశం లేదని, పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉందని, ఇక్కడ్నించే సమీక్షలు చేపట్టేందుకు అనువుగా నిర్మించారని వివరించారు. ఇంత రహస్యంగా విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు? అని గంటా సూటిగా ప్రశ్నించారు.రుషికొండపై గతంలో టూరిజం కోసం హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏటా రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఈ రిసార్ట్స్ ను పడగొట్టి ప్యాలెస్ ను నిర్మించారని మండిపడ్డారు. ఆఖరికి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఈ విలాస భవనం నిర్మించారని విమర్శించారు. మొదట స్టార్ హోటల్ అన్నారని, ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం అన్నారని, అనంతరం టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని ఆరోపించారు.