సహజీవనం వద్దందని చంపేశాడు బెంగళూరులో గోదావరిఖని యువతి హత్య
![సహజీవనం వద్దందని చంపేశాడు బెంగళూరులో గోదావరిఖని యువతి హత్య](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64803d637fb84.jpg)
ముద్ర, బెంగళూరు: రాష్ట్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆకాంక్ష బెంగళూరులో దారుణంగా హత్యకు గురైంది. నిందితుడిని ఢిల్లీకి చెందిన అర్పిత్గా గుర్తించారు. అర్పిత్ గ్లోబల్ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్లో పనిచేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం బైజూస్లో పనిచేస్తున్నప్పుడు ఆకాంక్ష, అర్పిత్ కలిశారని అంటున్నారు. అర్పిత్, ఆకాంక్ష చాలా రోజులు సహజీవనం చేశారని, ఇటీవలే వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీనికి అర్పిత్ ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల ఐదున అర్పిత్ బెంగళూరులోని ఆకాంక్ష ఫ్లాట్ కు వెళ్లాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అర్పిత్ ఆకాంక్షను చున్నితో గొంతు నులిమి చంపాడని, ఆత్మహత్యగా చూపించే ప్రయత్నంలో ఆమె మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. విఫలమవడంతో మృతదేహాన్ని అక్కడే వదిలి అపార్ట్మెంట్ తలుపుకు తాళం వేసి సంఘటనా స్థలం నుండి పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. అర్పిత్ ఆచూకీ కోసం నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (ఈస్ట్) ఎం చంద్ర శేఖర్ తెలిపారు.