రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

ముద్ర,సెంట్రల్ డెస్క్:-అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీ కొన్నాయి. వీటిలో ఒకదాని ఇంజన్ అదుపుతప్పి పక్క ట్రాక్ పై ప్రయాణిస్తున్న ఫ్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్లు ఇంజిన్ భాగాలు, భోగీలు దెబ్బతిన్నాయి. ఇద్దరు లోకో పైలట్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని యూపీకి చెందిన వికాస్ కుమార్, హిమన్షు కుమార్ గా గుర్తించారు. వారిని అంబులెన్స్ సహాయంతో పాటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఈ ప్రమాదంలో పెద్ద ప్రాణనష్టం తప్పినట్లు సమాచారం. గూడ్స్ రైళ్లకోసం నిర్మించిన డీఎఫ్సీసీ ట్రాక్ న్యూసిర్హింద్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు వాహనాలు ఇక్కడ నిలిపి ఉంచారు. అంబాలా నుంచి జమ్మూతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ఫ్యాసింజర్ రైలుపైకి ఒక గూడ్స్ రైలు ఇంజన్ పడిపోయింది. ఈ సమయంలో ఫ్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయంతో పెద్దగా కేకలు వేశారు. అయితే, ప్రమాదవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. మరోవైపు అంబాలా టూ లూథియానా అప్ లైన్ పూర్తిగా నిలిచిపోయింది.