తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి - నష్టపోయిన పంటలకు పరిహారమివ్వాలి : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం 

ముద్ర , నల్గొండ :  ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మిన వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గురువారం నకిరేకల్ లోని కడపర్తి రోడ్లో  లక్ష్మిసుజాత ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో ఐకేపీ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభ మయ్యాయని తెలిపారు. కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్య కారణంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు.తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టాల్లేక తడిసి ముద్దై మొలకెత్తుతున్నదని పేర్కొన్నారు.

ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక కేంద్రాల్లో ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోతున్నదని తెలిపారు. గోనెసంచుల కొరత తీవ్రంగాకనిపిస్తున్నదని వివరించారు. పది లారీలకు పంపాల్సిన గోనెసంచులను కేవలం ఒకట్రెండు లారీలకు మాత్రమే సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలను అన్లోడ్ చేయడంలో రైస్ మిల్లర్ల దగ్గర కొంత జాప్యం జరుగుతున్నదని తెలిపారు. ఏరోజుకారోజు కొనుగోలు చేయకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నదని వివరించారు. దీంతో వారాలపాటు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కనీస సదుపా యాల్లేవని పేర్కొన్నారు. భద్రత లేక దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం తూకం వేయడానికి తేమను సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. తరుగు తీయడం, బిల్లుల్లో కోతలు పెట్టడం ద్వారా రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని వివరించారు.

మార్కెట్లలో ప్రత్యక్ష దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా కనుబడుతున్నదని తెలిపారు. కోతకొచ్చిన వివిధ రకాల పంటలు, తోటలు కూడా ఈ అకాల వర్షాలకు దెబ్బతినడంతో ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో కదలిక లేక రైతులు మనోవ్యధకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో సరిపోయినన్ని గోనెసంచులు, లారీలు, పట్టాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలను కల్పించాలని కోరారు. నష్టపోయిన అన్ని పంటల వివరాలను సేకరించి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సూచించారు. ఆయన వెంట తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, డివైఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి రవీంద్ర చారి స్టాలిన్ సురేష్ రైతులు పాల్గొన్నారు.