కొండగట్టు కు వెయ్యి కోట్లు తీసుకురా: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే శంకర్

కొండగట్టు కు వెయ్యి కోట్లు తీసుకురా: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే శంకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిజమైన హిందువు అయితే కొండగట్టుకు మరో వెయ్యి కోట్లు తీసుకురావాలని  చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లోని మీసేవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మారుస్తున్నారని మండిపడ్డారు.

కెసిఆర్ దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తున్నాడని అనడం సరికాదన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దడానికి ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల తో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. రెండు వేల కోట్లతో యాదాద్రి, వందల కోట్లతో వేములవాడ, ధర్మపురిలను అభివృద్ధి చేస్తున్న సంగతి బండికి తెలియదా అని ప్రశ్నించారు. రాముడి పేరుతో బిజెపి రాజకీయం చేస్తున్నది నిజం కాదా అన్నారు.

కొండగట్టు పరిసర ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాయకులకు భూములు ఉన్నాయంటూ ఆరోపించడం అర్థరహితం అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక ఆలయాలను అభివృద్ధి పరచడం బిఆర్ఎస్ సంస్కృతి కాదన్నారు. దేవుళ్ళ పేరుతో రాజకీయం మాని అభివృద్ధి పై దృష్టి సారించాలని బండి సంజయ్ కి హితువు పలికారు. ఈ సమావేశంలో గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ చొప్పదండి నియోజకవర్గం జెడ్పిటిసిలు, ఎంపీపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.