మినిట్స్‌ వివరాలు ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమం 

మినిట్స్‌ వివరాలు ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమం 

అమరావతి: ప్రభుత్వ హామీలన్నీ లిఖిత పూర్వకంగా ఇస్తే ఉద్యమ కొనసాగింపుపై పునరాలోచన చేస్తామని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అది కూడా బుధవారం సాయంత్రంలోగా మినిట్స్‌ కాపీలు ఇస్తే రేపటి నల్ల రిబ్బన్ల నిరసన విరమిస్తామన్నారు. లేదంటే యథావిధిగా నిరసన కొనసాగుతుందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి స్పష్టంగా చెప్పినట్లు బొప్పరాజు వెల్లడించారు.

బొప్పరాజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ''మిగిలిన పీఆర్సీ బకాయిలు, కొత్త డీఏలు తదితర అంశాలపై స్పష్టత రావాల్సిన తరుణంలో మళ్లీ సీఎస్‌ ఆధ్వర్యంలో ఈనెల 16న జరిగే సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. వాటన్నింటినీ లిఖితపూర్వకంగా మినిట్స్‌ రూపంలో ఇవ్వాలని మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ, సీఎస్‌కు తెలియజేశాం. ఒకవేళ బుధవారం సాయంత్రంలోపు మినిట్స్‌ ఇవ్వకపోతే యథావిధిగా ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం'' అని వెల్లడించారు. రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న బొప్పరాజు.. తమ అజెండా నుంచి పక్కకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.