పాతికేళ్లకే.. న్యాయమూర్తిగా.. 

పాతికేళ్లకే.. న్యాయమూర్తిగా.. 
judge in young age

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేవరకు పోరాడండి..’ ఇది అబ్దుల్​ కలాం మాట.  ఆ మాటలు కర్ణాటక చెందిన గాయత్రికి సరిగ్గా సరిపోతాయి. మనసులో ఒక సంకల్పం చేసుకున్నాక.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టనష్టాలు ఎదురైనా, వైఫల్యాలు వెంబడించినా వెనకడుగు వేయకూడదు. అలానే చేసింది గాయత్రి.. ఓ దినసరి కూలీ కూతురు అయినా, కార్పొరేట్​ స్కూల్స్​లో చదవకున్నా తన కలలను సాకారం చేసుకోవడానికి ఇవేవీ అడ్డంకి కాదని నిరూపించి, అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న గాయత్రి కథ అందరికీ స్ఫూర్తిదాయకం..  గాయత్రిది కర్ణాటకలోని యళబుర్గి, బంగారపేట.  నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి. నిరుపేద కుటుంబం.

గాయత్రి తల్లిదండ్రులిద్దరూ రోజువారి కూలీలే.. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి.. పనులకు వెళ్లి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనే కూతుర్ని చదివించారు. తమలాగే తమ ఒక్కగానొక్క కూతురు కష్టపడకూడదని తపన పడ్డారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి చదివింది గాయత్రి.. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. చదువుతోనే తన జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంది. చదువుతోనే ఉన్నతస్థాయి సాధ్యం అని నమ్మింది. ప్రైవేటు స్కూల్లలో చదివితేనే చదువు వస్తుందని నమ్మలేదు.. అందుకే ఎన్​.కారహళ్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది.

కోలార్​ ఉమెన్స్​ కాలేజీలో బీకాం పూర్తి చేసింది గాయత్రి.. తరువాత కేజీఎఫ్​లోని కెంగల్​ హనుమంతయ్య కాలేజీలో 2021లో ‘లా’ పూర్తిచేసింది. యూనివర్శిటీలో నాలుగో ర్యాంకు సాధించింది. అదే సంవత్సరం డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​బేస్​పై  సివిల్‌ జడ్జి పోస్టులకు  దరఖాస్తు చేసుకుంది. కానీ ఫెయిల్ అయ్యింది. రెండోసారి ప్రయత్నించింది.. ఫలితం సాధించింది. పాతికేళ్ల వయసులోనే  కోలారు సివిల్‌ కోర్టు న్యాయమూర్తి అయింది.. గాయత్రి కష్టం వెనుక ఆమె పట్టుదల ఉంది. పేదరికంలో పుట్టినా, కార్పొరేట్​ స్కూల్స్​లో చదవకున్నా, కష్టపడి న్యాయమూర్తిగా తను అనుకున్న స్థాయిని అందుకుంది గాయత్రి. కూతుర్ని ఉన్నతస్థానంలో చూడాలనుకున్న కన్నవారి కోరికను నెరవేర్చింది.

న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుని.. సీనియరు న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్‌ న్యాయవాదిగా పనిచేసింది. ఆమెలో ఉన్న ప్రతిభ, పట్టుదల గమనించిన న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం సివిల్‌ న్యాయమూర్తి పరీక్షలకు హాజరు కావటానికి చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. అలా సుబ్రహ్మణ్యం నమ్మకాన్ని.. తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, లక్ష్యాన్ని వదిలిపెట్టకుట్టకుండా.. గమ్యం దిశగా అడుగేలిసినప్పుడే.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతాం అని చేసి చూపించింది గాయత్రి.