ఖమ్మం గుమ్మం ఇటు.. అటు..

ఖమ్మం గుమ్మం  ఇటు.. అటు..
khammam

తెలంగాణలో ఇపుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. మూడు ప్రధాన పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను లక్ష్యం చేసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. దాంతో వచ్చే రెండు, మూడు నెలలు ఉమ్మడి ఖమ్మం జిల్లా సెంట్రిక్‌గా పలు రాజకీయ కార్యక్రమాలు ఊదరగొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.  జనవరి 18న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సంసిద్దమవుతోంది. వంద ఎకరాల్లో సుమారు నాలుగు లక్షల మందిని సవిూకరించడం ద్వారా జిల్లాలో పార్టీ సత్తా చాటేలా బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లా నేతలను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన సభకు కేసీఆర్‌ కాకుండా మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరవుతారని కేసీఆర్‌ సన్నాహక భేటీలోనే వెల్లడిరచడం చూస్తే బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించాక జరుగుతున్న తొలి బహిరంగ సభకు సంబంధించిన ప్లానింగ్‌ చాలా రోజుల క్రితమే కేసీఆర్‌ ప్రారంభించినట్లు బోధపడుతోంది. జనవరి 9న నిర్వహించిన సన్నాహక సమావేశంలోనే ఖమ్మం సభకు సంబంధించిన బాధ్యతలను మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డిలకు అప్పగించారు.ఖమ్మం జిల్లాలో కీలక నేతగా పేరున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ వీడనున్న సంకేతాలు బలపడడంతో ఆయనను వదులుకునేందుకే కేసీఆర్‌ సిద్దమైనట్లు తెలుస్తోంది. అదేసమయంలో కొంతకాలంగా ఇనాక్టివ్‌గా వున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును యాక్టివ్‌ చేసేందుకు కేసీఆర్‌ యత్నాలు మొదలుపెట్టారు. ఖమ్మం సభ సన్నాహక భేటీకి తుమ్మల హాజరుకానప్పటికీ.. అదేరోజు జరిగిన కేటీఆర్‌ మామ దశదిన కర్మకు తుమ్మల వచ్చారు. అక్కడ కేసీఆర్‌, కేటీఆర్‌తో తుమ్మల భేటీ అయినట్లుగా కథనాలు వచ్చాయి.

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీని వీడినా ఖమ్మం జిల్లాలపై బీఆర్‌ఎస్‌ పట్టు కొనసాగాలని, అందుకు పువ్వాడ అజయ్‌, తుమ్మల నాగేశ్వర్‌ రావు, నామా నాగేశ్వర్‌ రావు వంటి నేతలు కలసి కట్టుగా పని చేయాల్సి వుంటుందని కేసీఆర్‌ జిల్లా నేతలకు ఉద్భోధ చేసినట్లు తెలుస్తోంది.2014 నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ పెద్దగా ఆశాజనక ఫలితాలను సాధించలేదు. కాకపోతే కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష అక్కడ బాగానే పని చేసింది. దాంతో అక్కడ టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్‌ పార్టీలో చేరిపోయారు. దాంతో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరేసి, ముగ్గురేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లు తయారయ్యారు. తాజాగా పాలేరు నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్‌ రావు, కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచిన గులాబీ తీర్థం పుచ్చుకున్న కందాల ఉపేందర్‌ రెడ్డిల మధ్య ఎవరిని ఖరారు చేయాలో మున్ముందు కేసీఆర్‌ పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పాలేరు బరిలోనే తానే వుంటానని తుమ్మల నాగేశ్వర్‌ రావు స్వయంగా ప్రకటించేసుకున్నారు. తుమ్మల కామెంట్‌ బీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహాత్మక మౌనం పాటించారు.  అయితే జనవరి తొలివారంలో తన అనుచరవర్గంతో మాట్లాడిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి 2023 ఎన్నికల్లో పాలేరు టిక్కెట్‌ తనదేనని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గం ఇపుడు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. మూడోసారి అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకోవడం అనివార్యమని భావిస్తున్నారు కేసీఆర్‌. అందుకే జిల్లా నేతలను అప్రమత్తం చేస్తున్నారు. అదేసమయంలో ఆ జిల్లా పరిధిలో కమ్యూనిస్టులు బలంగా వుండడంతో వారితో పొత్తుకు సిద్దమవుతున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతే బీఆర్‌ఎస్‌ పార్టీని గట్టెక్కించింది.

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాలకింకా ఎంతో కొంత బలముంది. దాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమవైపు మలచుకునేందుకు కేసీఆర్‌ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, వామపక్షాలు అడిగే సీట్లను వదులుకునేందుకు కేసీఆర్‌ ఏ మేరకు సిద్దపడతారన్నది ఆసక్తికరం. చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం తహతహలాడుతున్న కమ్యూనిస్టులు బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తుకు బేషరతుగా రెడీ అవుతున్నాయి. 2014లో సీపీఐ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను కేసీఆర్‌ లాగేసుకున్న అంశాన్ని కూడా సీపీఐ నేతలు పక్కన పెట్టి మునుగోడులో గులాబీ పార్టీకి సహకరించారు.బీజేపీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినాయకత్వంపై కినుక వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు ఎప్పట్నించో ప్రయత్నిస్తున్నారు. 2018లో టిక్కెట్‌ దక్కకున్నా అయిదేళ్ళు పార్టీలోనే కొనసాగిన పొంగులేటి.. ఈ మధ్యకాలంలోనే గళమెత్తుతున్నారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగాల్సిన అవసరం వుందా అని తన అభిమానులను అడుగుతున్నారు. ఈక్రమంలో బీజేపీ నేతలతో పొంగులేటి టచ్‌లోకి వెళ్ళారు. ఈ పరిణామాలను గమనించిన కేసీఆర్‌.. పొంగులేటిని వదులుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తాజా పరిణామాలు, మరీ ముఖ్యంగా జనవరి 9న జరిగిన భేటీకి పొంగులేటిని పిలవకపోవడం వంటివి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈక్రమంలో జనవరి 18వ తేదీన పొంగులేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కాబోతున్నరన్న వార్తలు దర్శనమిచ్చాయి. ఇటు ఖమ్మంలో కేసీఆర్‌ బహిరంగ సభ ప్లాన్‌ చేసిన రోజునే అమిత్‌ షాతో పొంగులేటి భేటీ కానుండడం విశేషం. ఆ మర్నాడు అంటే జనవరి 19వ తేదీన హైదరాబాద్‌ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోను పొంగులేటి ములాఖత్‌ ప్లాన్‌ చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. ఈక్రమంలో పొంగులేటి బీజేపీలో చేరడం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే ఆయన బీజేపీలో చేరిన వెంటనే ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు కమలనాథులు ప్లాన్‌ చేస్తున్నారు.

జనవరి 18న జరగనున్న బీఆర్‌ఎస్‌ సభను మించిన స్థాయిలో జనసవిూకరణ చేయాలని చూస్తున్నారు. ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో బీజేపీ బహిరంగ సభ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక తెలంగాణలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. జనవరి 26వ తేదీ నుంచి హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్రను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించాలని టీపీసీసీ దాదాపు నిర్ణయించింది. భద్రాచల శ్రీరాముని సన్నిధి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కలిసి పాదం పాదం కలుపుతారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. పాదయాత్ర ప్రారంభానికి భారీ స్థాయిలో జనసవిూకరణకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్లాన్‌ చేస్తున్నాయి. ఇక తెలంగాణలోకి రీఎంట్రీకి ట్రయల్స్‌ ప్రారంభించి, ఖమ్మం జిల్లాలోనే మొదటి సభను నిర్వహించిన టీడీపీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి తొలినుంచి అండాదండాగా వున్న సామాజిక వర్గం అధికంగా వున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక సీట్లు గెలుచుకునేలా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. అందుకు జనసేన పార్టీని కూడా కలుపుకుని వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలను వదులుకుని, తెలంగాణలో అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చిన వైఎస్‌ షర్మిల కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆమె స్వయంగా పాలేరు నియోజకవర్గం బరిలోకి దిగుతానని ఇదివరకే రెండుమార్లు ప్రకటించారు. ఇలా ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజే?పీ, కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్టీపీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే ఫోకస్‌ చేయడంతో రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.