Take a fresh look at your lifestyle.

త్వరలో తెలంగాణ అఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీ

  • ఓఆర్​ఆర్​,ఆర్​ఆర్​ఆర్​ ల మధ్య కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహా ఇండ్ల నిర్మాణం
  • కనీసం వంద ఎకరాల్లో టౌన్​ షిప్​ నిర్మాణం
  • పేద, మధ్య తరగతి ప్రజలందరికీ గృహాలు
  • హిమాచ‌ల్ ప్రదేశ్ హౌసింగ్ మంత్రి రాజేష్ ధ‌ర్మానితో మంత్రి పొంగులేటి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ అఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు,రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో మధ్య తరగతి ప్రజానీకం కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. కనీసం వంద ఎకరాలలో ఈ టౌన్ షిప్ లను నిర్మించి మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. శ‌నివారం రాష్ట్ర స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డితో హిమాచ‌ల్ ప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఎస్.హెచ్‌.రాజేష్ ధ‌ర్మాని స‌మావేశ‌మ‌య్యారు. ఇందులో ఆ మంత్రి తెలంగాణ ప్రభుత్వం చేప‌డుతున్న గృహ‌నిర్మాణ ప‌ధ‌కాలను అడిగి తెలుసుకున్నారు. రాజేష్​ ధర్మానికి తెలంగాణ అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి పొంగులేటి వివరించారు.

ఇందులో హౌసింగ్‌ నియమ నిబంధనల మేరకు అందుబాటులో ఉన్న బోర్డు స్థలాల్లో కొత్తగా గృహనిర్మాణానికి సంబంధించిన పథకాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌, ప్రభుత్వరంగ భాగస్వామ్యంతో అఫర్డబుల్‌ గృహ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర మంత్రికి వివరించారు. హౌసింగ్ బోర్డు కు సంబంధించిన భూముల పరిరక్షణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు వివిధ కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్తీకరణ చట్టం 2014ను అననుసరించి ఆస్తులు, అప్పుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో పేద‌లంద‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడ‌మే త‌మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం ద్వారా నిరుపేద‌ల‌కు శాశ్వత గృహాలు నిర్మించాల‌న్న సంక‌ల్పంతో వ‌చ్చే నాలుగేళ్లలో 20 ల‌క్షల‌ ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు.ఇప్పటికే మొద‌టి ద‌శ‌లో ల‌బ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వ‌చ్చిందన్న మంత్రి.. వీలైనంత త్వర‌లో ఇండ్ల నిర్మాణాలు చేప‌ట్టనున్నట్లు వివరించారు. ల‌బ్దిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకునే సౌల‌భ్యం క‌ల్పించామన్న పొంగులేటి.. 400చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం, వంట‌గ‌ది, టాయిలెట్ సౌక‌ర్యం క‌లిగిఉంటాయని వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే రూ. 5 ల‌క్షల ఆర్ధిక సాయం అందిస్తుంద‌ని వివ‌రించారు.హైదరబాద్ నగరం వేగంగా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని, హైదరబాద్, సికిందరాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా ఫోర్త్ సిటిగా 15 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని పొంగులేటి.. రాజేష్ ధ‌ర్మానికి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.