కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ అడుగు..

కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే ఈ అడుగు..
Revanth Reddy Hath Se Hath Jodo Padayatra
  • అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యం చేస్తున్నడు..
  • తెలంగాణను బొందల గడ్డగా మార్చిన్రు..
  • తల్లుల స్పూర్తితో పోరాటాలకు సిద్ధమయ్యాం..
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • ములుగు జిల్లాలో ప్రారంభమైన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే నని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా టీపీసీసీ చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం ములుగు జిల్లాలోని పస్రా గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.  ములుగు నుంచి సీతక్కను ఎమ్మెల్యేగా గెలిపిస్తే..ములుగు ఖ్యాతిని ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. కులాల మధ్య ప్రాంతాల మధ్య  చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని చెప్పారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారన్నారు. రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని వివరించారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలు  పెట్టడానికి ఒక కారణం ఉందని సమ్మక్క సారలమ్మ వన దేవతలు నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారు.  కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన సమ్మక్క సారక్క పోరాడిన గడ్డ ఇది. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇది. అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు.

అధికారం అడ్డుపెట్టుకుని కేసీఆర్ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని, మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదు.... కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికేననేది గుర్తు పెట్టుకోవాలన్నారు. నాడు వైఎస్, చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికిందంటే.. ఈ యాత్ర విజయవంతం అయినట్లేనని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందని, కేసీఆర్ పాలనతో తెలంగాణ కోసం అమరుల ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోందని, అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టి కప్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమేనా.. నోటిఫికేషన్ల వేయకుండాతొమ్మిదేళ్లు ప్రభుత్వం  కాలయాపన చేయడం, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమేనా అని విమర్శనాస్త్రాలు సంధించారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పేదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా? భర్తకు ఫించన్ ఇస్తే భార్యకు పింఛన్ ఇవ్వకపోవడం సంక్షేమమేనా, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 25 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ లెక్కన ప్రతి నియోజకవర్గానికి రూ. 20 వేల కోట్లు రావాలి. ములుగుకు రూ. 20 వేల కోట్లు వచ్చాయా? మరీ ఆ 25 లక్షల కోట్ల బడ్జెట్ ఎటు పోయింది? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 10 శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారని విమర్శించారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు,  బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుందని చేంజ్ అనే నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నామని వివరించారు. అన్ని వర్గాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలని, చేంజ్ రావాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మార్పు రావాలని తెలిపారు. కేసీఆర్ కు ఏమీ తెలియదు. ఎవరూ చెప్పిన వినడు. ఇటువంటి కేసీఆర్ మనకు అవసరమా? అని అన్నారు.

రేవంత్ వస్తున్నాడని రాత్రికి రాత్రే పట్టాలు: సీతక్క
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ. పేదలకు బతుకుదేరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ములుగు నుంచి ఉంటుందని తెలిసిన స్వల్ప సమయంలో ఒక్క పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మీలో ఎంత ఉత్సహం ఉందో అర్ధమవుతోందని సీతక్క అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం ఆనాడు సమ్మక్క సారక్క పోరాడి అమరులయ్యారు. ఆ వనదేవతల ఆలయం నుంచి సోదరుడు రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషం. నేను పేదింటి బిడ్డనైనా... నన్ను మీరంతా అక్కున చేర్చుకున్నారు. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం సంతోషం. కాంగ్రెస్ ను అధికారంలోకి తీలుకొచ్చే వరకు చేతిలో చేయి వేసి.. అడుగులో అడుగేయాలి. రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేస్తుండ్రు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ. పేదలకు బతుకుదేరువు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేవరకు రేవంత్ అడుగులో అడుగేయాలని పిలుపునిచ్చారు. తాను పేదింటి బిడ్డనైనా అక్కున చేర్చుకున్నారని.. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. మేడారం వనదేవతల ఆలయం నుంచి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు.

వైఎస్ఆర్ గుర్తొస్తున్నారు : షబ్బీర్ అలీ, మాజీ మంత్రి
రేవంత్ యాత్రను చూస్తుంటే నాకు వైఎస్ఆర్ గుర్తొస్తున్నారు. ఆయన చెల్లెమ్మా అంటూ చేవెళ్ల నుంచి యాత్ర చేశారు. రేవంత్ సీతక్క అంటూ ములుగు నుంచి యాత్ర మొదలు పెట్టారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు సాగుతున్నాయి. వీటి నుంచి దేశాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారు.  ఈ యాత్ర ద్వారా రాహుల్ సందేశాన్ని గ్రామ గ్రామాన తీసుకెళతాం. రాహుల్ స్ఫూర్తితోనే రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు. పేదల ఇబ్బందులు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.

మేడారంలో పూజలతో యాత్ర మొదలు..
 అంతకుముందు మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి వనదేవతల ఆశీర్వాదం తీసుకొని అక్కడే నుంచే హాత్ సే హాత్ జోడో పాదయాత్రను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మేడారం నుంచి మొదలైన పాదయాత్ర ప్రాజెక్టు నగర్ వరకు సాగింది. అక్కడి విరామం తీసుకున్నారు. విరామం తర్వాత పాదయాత్ర ప్రాజెక్టు నగర్ నుంచి పస్రా గ్రామానికి చేరుకుంది. మార్గమధ్యలో పుట్టాపూర్ గ్రామానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు రేవంత్ రెడ్డిని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలిసుకున్నారు రేవంత్ రెడ్డి. పస్రా కార్నర్ మీటింగ్ తర్వాత పాదయాత్ర రామప్ప గ్రామం వరకు కొనసాగింది. రాత్రి ఆ గ్రామంలోనే బస చేశారు.

ముందుగా గట్టమ్మ తల్లి ఆశ్వీరాదం..
హాత్ సే హాత్ జోడో యాత్ర కోసం ములుగు చేరుకున్న రేవంత్ రెడ్డి ముందుగా ములుగు గట్టమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేశారు. సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదం కోసం వచ్చే భక్తులంతా తొలుత మహిమ గల ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేసి మేడారం వెళ్లడం అనవాయితీ. అనవాయితీలో భాగంగా  గట్టమ్మ తల్లిని దర్శించుకొని ఆశ్వీరాదం తీసుకున్నారు. తర్వాత సాయిబాబా ఆలయంలో కూడా పూజలు నిర్వహించారు.

దేవన్నపేట్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం..
హాత్ సే హాత్ జోడో యాత్ర కోసం మేడారం వెళ్తున్న రేవంత్ రెడ్డికి వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ దేవన్నపేట్ టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా మురళి, నాయిని రాజేందర్ రెడ్డి ఇతరులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు గజ మాలతో రేవంత్ రెడ్డిని సత్కరించారు.