దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేయాలి
తుంగతుర్తి ముద్ర:- దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు.ఐదు నెలల క్రితం రెండవ విడత దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు మంజూరు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రావల్సిన దళితబంధు పథకం డబ్బులు ఇచ్చేలా చూడాలని స్థానిక ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ కు గురువారం మండల దళిత బంధు లబ్ధిదారులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ..ఎన్నికల కోడ్ ముందు లబ్ధిదారులను ఎంపిక చేశారని ఎన్నికల కోడ్తో నిధులు నిలిచిపోయాయని ఎన్నికల కోడ్ ముందు గుర్తించిన లబ్ధిదారుల ఖాతాలో నిధులను వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.దళిత బంధు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు,జీవనోపాధికోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దళితబంధు నిధులు మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో చింతకుంట్ల మనోజ్, పుల్లూరు పరుశురాములు, జాజుగల్లా అంబేద్కర్, బొజ్జ సాయి కిరణ్ కొండగడుపుల వెంకటేష్, మిర్యాల జనార్ధన్ తదితరు లబ్ధిదారులు ఉన్నారు.