ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని దించే యోచన
అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తోంది. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 13తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిని నిలిపే అంశంపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విప్ జారీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఆయా ఎమ్మెల్యేలు విప్కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే విప్ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని టీడీపీ భావిస్తోంది.