బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు

బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు
  • అప్పులు నష్టాలలో సివిల్ సప్లై కార్పొరేషన్
  • పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్

ముద్ర ప్రతినిధి, హుజూర్ నగర్:ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు నష్టాలలో కూరుకుపోయిందని నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాలను సందర్శించిన ఆయన రేషన్ బియ్యం నాణ్యత ఇతర అంశాలపై రేషన్ డీలర్లతో మాట్లాడారు.తెలంగాణలో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలన్నారు. ప్రభుత్వాలు కిలో బియ్యానికి 39 రూపాయల ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లు గాని ఇతరులు ఎవరైనా రీసైక్లింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ 56వేల కోట్ల అప్పుల్లో 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని అన్నారు. ప్రతి ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్ పై కేవలం వడ్డీ భారమే మూడు వేల కోట్లు ఉందన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర 22 వేల కోట్ల దాన్యం నిలువలు గత ప్రభుత్వం పెట్టడంపై సమీక్ష జరుపుతామన్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చేపడుతున్న దాన్యం సేకరణ పద్ధతులను రేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తామని తెలిపారు.