కీలక సమయంలో విశాఖ సదస్సు- ఏపీ సీఎం జగన్
ముద్ర ప్రతినిధి, విశాఖపట్నం: మూడున్నరేళ్లలో రాష్ట్రం అనేక రకాలుగా ముందడుగు వేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, కొవిడ్ కష్టాలను కూడా అధిగమించామని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. విశాఖ ఏయూ గ్రౌండ్స్లో శనివారం పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించి అనంతరం ఆయన ప్రసంగించారు. ఇప్పుడు కీలక సమయంలో సదస్సు నిర్వహించామని వివరించారు. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని చెప్పారు. ఈ 15 కీలక రంగాలలో ఫలవంతమైన చర్చలు జరిగాయని, రెండు రోజులలో 352 ఎంవోయూలు కుదుర్చుకున్నామని అన్నారు. అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయానికి కృషి చేసిన అందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.