వైకాపా కార్యకర్తల అరాచకం జనసేన నేత కారుకు నిప్పు
ముద్ర,ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేశ్ కారును తగులబెట్టారు. ఇంటిముందు పార్క్ చేసిన కారుకు నిప్పు పెట్టడంపై మహేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.
''ఆదివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నా కారును వైకాపా గూండాలు తగులబెట్టారు. జనసేన తరఫున ప్రచారం చేస్తే నాపై వారికెందుకు అంత పగ? జగన్ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా? పవన్కల్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేశారు. మమ్మల్ని కొట్టి చంపాలని చూశారని కేసు పెట్టాం. ఒక్క రోజులో వారంతా బయటకి వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు నా కారును తగులబెట్టి రాక్షసానందం పొందుతున్నారు..
కారుకు పెట్టిన మంటలు మా ఇంటి గోడ వైపు వ్యాపించాయి. వంట గది అటువైపే ఉంది. అందులోకి మంటలు వ్యాపించి ఉంటే మా కుటుంబం మొత్తం చనిపోయేవాళ్లం. వైకాపా వాళ్లను తిట్టలేదు.. వాళ్లతో గొడవకి వెళ్లలేదు. పవన్కల్యాణ్పై అభిమానంతో జనసేనకు పనిచేస్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేస్తారా? పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నాను'' అని కర్రి మహేశ్ అన్నారు..