పేద క్రికెటర్ల కోసం మైదానం

పేద క్రికెటర్ల కోసం మైదానం
  • మాట నిలబెట్టుకున్న యార్కర్​కింగ్​ నటరాజన్​

చెన్నై: టీమిండియా పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ మాట నిలబెట్టుకున్నాడు. తనలాంటి పేద క్రికెటర్ల కోసం మైదానాన్ని నిర్మించి ఉచితంగా కోచింగ్ అందిస్తానని ఐపీఎల్‌లోకి వచ్చిన కొత్తలో చెప్పిన నటరాజన్.. అన్నంత పని చేశాడు. తమిళనాడు, సేలం జిల్లాలోని తన స్వగ్రామం చిన్నప్పంపట్టిలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించాడు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ స్టేడియాన్ని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో పాటు తమిళనాడు ఆటగాళ్లు, అభిమానులు హాజరయ్యారు. దినేశ్ కార్తీక్‌తో పాటు నటరాజన్ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. తమిళనాడు ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా నటరాజన్ స్టేడియాన్ని సందర్శించి అతనికి అభినందనలు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా నటరాజన్‌ చేసిన పనిని మొచ్చుకుంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్ హేమాంగ్ బదోని కూడా నటరాజన్ స్టేడియాన్ని సందర్శించాడు. ఇక ఐపీఎల్‌లో భారీ ధర పలికినప్పుడే నటరాజన్.. తన లాంటి పేద ప్లేయర్ల కోసం సొంతగ్రామంలో స్టేడియం నిర్మిస్తానని ప్రకటించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నటరాజన్.. మొకాలి గాయంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియాకు దూరమైనా.. తన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. సొంతడబ్బులతో మైదానం కోసం ల్యాండ్ కొనుగోలు చేసి నిర్మించాడు. మైదాన నిర్మాణానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకున్నాడు. నటరాజన్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు నటరాజన్‌ను కొనియాడుతున్నారు. 2019–-20 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా వెళ్లిన నటరాజన్ అనూహ్య పరిస్థితుల్లో జట్టులోకి వచ్చి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అనంతరం మొకాలి గాయంతో జట్టుకు దూరమైన అతను రిథమ్ కోల్పోయాడు. ఆ తర్వాత కోలుకున్నా.. గాయాలు వెంటాడటంతో మునపటి ఫామ్ కనబర్చలేకపోయాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయాడు.