175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా?

175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా?

తెనాలి: ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం తమకు ఉందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా?  అని  సవాల్‌ విసిరారు. తమది పేదల ప్రభుత్వమని.. చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని జగన్‌ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో 'వైఎస్సార్‌ రైతు భరోసా' నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 98.5 శాతం హామీలను అమలు చేశామని జగన్‌ చెప్పారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు ధైర్యంగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో తిరుగుతున్నారన్నారు.  ''వచ్చే ఎన్నికల్లో కరవుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగనుంది. ఆ యుద్ధం కులాల మధ్యకాదు.. పేదలు, పెత్తందార్ల మధ్య. పొరపాటు జరిగితే రాజకీయాల్లో ఇచ్చిన మాటపై నిలబటం అనేదానికి అర్థమే లేకుండా పోతుంది. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడు కాదు అనే పరిస్థితి రావాలి. అందుకే ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశామని గర్వంగా చెబుతున్నా. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండాలని మాత్రమే కోరుతున్నా. అన్నీ గమనించి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే ప్రామాణికంగా తీసుకోండి'' అని జగన్‌ కోరారు.