- దోమలు పుట్టకుండ కుట్టకుండా చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత.
- డాక్టర్ తారా సింగ్.
ముద్ర విలేఖరి,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో అచ్చంపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తారా సింగ్ జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తార సింగ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండేలా ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ప్రకారం ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో, ఇంటి ఆవరణలో, పరిసరాలలో గల నీటిలో దోమ యొక్క లార్వాలను గుర్తించి, వాటి తొలగించి శుభ్రపరచి, నీటి నిల్వలపై మూతలు పెట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి నివారించవచ్చు అని తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి కారక క్రిమి ఫ్లెవీ వైరస్ గల ఆడ టైగర్ దోమ కుట్టడం ద్వారా మనుషులకు డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుందని తెలియజేశారు. దోమ కుట్టిన తర్వాత మూడు నాలుగు రోజులకు విపరీతమైన జ్వరం తలనొప్పి కంటి వెనకాల నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, వాంతులు విరేచనాలు కడుపునొప్పి తదితర లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ప్రాథమిక లక్షణాల దశలోని డెంగ్యూ నాది నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధిని గుర్తించి ఇంటి ద్రావణాలను, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవడం,లేదా జ్వరం తగ్గడానికి పారాసెటమాల్ మాత్రలు వేయడం వల్ల డెంగ్యూ వ్యాధిని సులభంగా తగ్గించగలం అని అన్నారు.ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల శరీరంలోని మూత్రపిండాలు కాలేయము గుండె మెదడు తదితర అవయవం తీవ్ర ప్రభావానికి గురి అవుతాయి.కావున ప్రజలు దోమలు పుట్టకుండా కుట్టకుండా వ్యక్తిగతంగా శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.ప్రజలు తమ ఇంటిలో ప్రతి శుక్రవారం పోడిదినం (డ్రై డే) పాటించాలి.ఇంటి ఆవరణలో పనికిరాని టైర్లు ప్లాస్టిక్ మూతలు, సీసాలు,కొబ్బరి చిప్పలు, లేకుండా చేసుకోవాలి. టైగర్ దోమలు పగటిపూట ఉదయము సాయంత్రం కుడతాయి.ఇంటి తలుపులకు కిటికీలకు ఇనుప జాలీలు బిగించుకోవాలి. చిన్నారులకు చేతులుకవర్ అయ్యే విధంగా చొక్కాలు, ప్యాంట్లు సాక్సులు వేయడం ద్వారా దోమ కాటు నుంచి రక్షించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బిక్కులాల్, పర్యవేక్షకులు హనుమంతు, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు