Take a fresh look at your lifestyle.

మీ గొంతుకై ఉన్నా.. భవిష్యత్​లోనూ ఉంటా..!

  • సిట్టింగ్​ టీచర్స్​ ఎమ్మెల్సీ, అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి హామీ
  • 2019లో అవకాశం ఇస్తే మండలిలో, బయట మీ సమస్యలపై గళమెత్తా!
  • మొదటి పీఆర్సీ కోసం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశా!
  • పదోన్నతులపై ఢిల్లీకి వెళ్లి ఎన్​ సీటీఈ చైర్మన్, కార్యదర్శితో మాట్లాడి పరిష్కరించాం
  • బదిలీలు, పదోన్నతులపై సీఎంతో చర్చించి ప్రక్రియ పూర్తి చేశాం
  • పాఠశాలల్లో క్లీనింగ్​, సర్వీసుల కోసం విద్యాశాఖ గ్రాంట్ల కోసం కొట్లాడి సాధించా
  • స్కూళ్లలో సర్కార్​ విద్యుత్​ బిల్లుల చెల్లింపులో నా పాత్రే కీలకం
  • సీపీఎస్​ రద్దు కోసం శాసనమండలిలో గళమెత్తా
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నర్సిరెడ్డి వినతి
ముద్ర, తెలంగాణ బ్యూరో : అన్ని వర్గాల ప్రజల సమస్యలపై గొంతుకనై శాసనమండలిలో, బయట గళమెత్తుతోన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వరంగల్​, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం సిట్టింగ్​ ఎమ్మెల్సీ, ప్రస్తుత అభ్యర్ధి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజ్ఙప్తి చేశారు.ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటానని కోరారు. 2019 మార్చి 22న జరిగిన ఎన్నికల్లో పట్టం కట్టిన తనకు అవకాశం కల్పిస్తే…గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయయులు, అధ్యాపకుల గొంతుకనై వారి సమస్యలపై శాసనమండలిలో, బయట గళమెత్తుతున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో మొదటి పీఆర్సీ అమలుకు ఆలస్యమవుతున్న సమయంలో 2020 మార్చి 5న ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టానన్నారు. శాసనమండలి జరుగుతున్న సమయంలోనే పీఆర్సీ రిపోర్టు 7.5శాతం ఫిట్​ మెంట్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే 30శాతం ఇవ్వాల్సిందేనని మండలిలో గళమెత్తి అనుకున్నది సాధించానన్నారు. అలాగే కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకారం 30శాతం వేతనాలు పెరగడంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్​ సమస్య ప్రధాన అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి ఎన్​ సిటీఈ చైర్మన్​, కార్యదర్శితో మాట్లాడి పరిష్కరించినట్లు వెల్లడించారు. గతేడాది జూన్​ 16న ఉపాధ్యాయ సంఘ నేతలను సీఎం రేవంత్​ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి.. బదిలీలు, పదోన్నతులపై చర్చించానన్నారు. దాంతో పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తయిందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్లీనింగ్​,సర్వీసు పనుల కోసం విద్యాశాఖ నుంచి గ్రాంట్లు ఇవ్వాలని మూడేళ్లు శాసనమండలిలో గళమెత్తాననీ..ఫలితంగా ఆరు స్లాబుల్లో గ్రాంట్లు మంజూరయ్యాయన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వమే విద్యుత్​ బిల్లుల చెల్లింపు విషయంతో తన పాత్ర కీలకమన్నారు. మోడల్​ పాఠశాలల బోధన సిబ్బందికి 2020 పీఆర్​సీ సెలవుల మంజూరు, బదిలీల సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. ఐదు రకాల గురుకులాల్లో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్​ జారీ చేయించి పూర్తయ్యేలా ఒత్తిడి పెంచానన్నారు. అలాగే కేజీబీవీ ఉపాధ్యాయులకు రెండు సార్లు జీతాల పెంపు, మూడు సార్లు బదిలీలు, ఎండాకాలం జీతం, ఆటో రెన్యూవల్​, ఎమ్మెల్సీ ఓటు హక్కు సాధనలో ఇతోధిక కృషి చేశానన్నారు. జూనియర్​ లెక్చరర్ల బదిలీలు, కాంట్రాక్ట్​ లెక్చరర్ల రెగ్యులరైజేషన్​, గెస్ట్​ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు చెప్పారు.

డిగ్రీ, పాలిటెక్నిక్​ లెక్చరర్ల బదిలీలు రెగ్యులరైజేషన్​, యూనివర్సిటీ కాంట్రాక్ట్​ అధ్యాపకుల వేతనాల పెంపు కోసం కృషి చేసినట్లు వివరించారు. సీపీఎస్​ రద్దు కోసం శాసనమండలిలో గళమెత్తిన తాను మండలి బయట పోరాటాల్లో పాల్గొన్నానన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష, నిరసన దీక్ష చేశానన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నల్గొండ నుంచి గత సీఎం క్యాంపు కార్యాలయం (ప్రగతిభవన్​) వరకు నాలుగు రోజులు పాదయాత్ర చేసినట్లు వివరించారు. అలాగే మండలి జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ క్వార్టర్స్​ నుంచి మండలి వరకు సమస్యలతో కూడిన బ్యానర్​ తో నడుచుకుంటూ వెళ్లి, నిరసన తెలిపానన్నారు.
ఎమ్మెల్సీగా… సాధ్యమైన, సాధ్యంకాని సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు కృషి చేసిన తాను మరోసారి అవకాశం వరిస్తే అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషి చేస్తానని అలుగుబెల్లి నర్సిరెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యంగా 2023 డీఎస్సీ ఉపాధ్యాయులతో సహా 2004 సెప్టెంబర్​ నుంచి ఉద్యోగాల్లోకి వచ్చిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులకు సీపీఎస్​ రద్దు చేయించి ఓపీఎస్​ అమలు చేయించాల్సి ఉందన్నారు. మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్​, జూనియర్​ లెక్చరర్ల పోస్టుల్లో పదోన్నతులు అమలు చేయించాల్సి ఉందన్నారు. ఐదు రకాల గురుకులాల సమయ మార్పిడి, హెల్త్​ కార్డులు, డిప్యూటీ వార్డెన్​ పోస్టుల మంజూరు, 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు జరిగేలా చూడాల్సి ఉందన్నారు.
కేజీబీవీ ఉపాధ్యాయులకు మినీమమ్​ బేసిక్​ పే, కేర్​ టేకర్​ పోస్టు మంజూరు, హెల్త్​ కార్డులు, ఉద్యోగ భద్రత సాధించాల్సి ఉందన్నారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న భాషాపండితులు, పీఈటీ పోస్టుల అప్​ గ్రేడేషన్​, సీఆర్టీలకు మినిమం బేసిక్​ పే, కన్వర్టెడ్​ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయించాల్సి ఉందన్నారు. జూనియర్​ కళాశాలకు నిర్వహణ గ్రాంటు మంజూరు, ఇతర సమస్యల పరిష్కారానికి శక్తివంచనా లేకుండా కృషి చేస్తానన్నారు. డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్​ అధ్యాపకులకు 7వ కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ ఎరియర్స్​ ఇప్పించడం,  యూనివర్సిటీ కాంట్రాక్ట్​ అధ్యాపకుల  రెగ్యులరైజేషన్​, గ్రాంట్ల పెంపుదల, సెల్ఫ్​ ఫైనాన్స్​ కోర్సులను రెగ్యులర్​ కోర్సులుగా మార్చడం, ప్రైవేట్​ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్​యాపకులకు పీఎఫ్​ అమలు, హెల్త్​ స్కీములు, పదవీ విరమణ బెనిఫిట్స్​, అర్హులైన వారికి ప్రభుత్వ గృహ నిర్మాణంలో అవకాశం కోసం చిత్తశుద్దితో కృషి చేస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.