ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారు సింహ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో బ్రహ్మోత్సవాల 4వ రోజు గురువారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించి సింహ వాహనసేవ మహా వైభవంగా నిర్వహించారు. సింహ వాహనంపై స్వామివారు దివ్యంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిచ్చి కటాక్షానుగ్రహం ప్రసాదించారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని మేల్కొటే తిరునారాయణపురం క్షేత్ర ప్రధానార్చకులు శ్రీ నరసింహ రాజ భట్టర్ స్వామి విచ్చేసి మహోత్సవాలకు శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా మేల్కొటే శ్రీ తిరునారాయణ స్వామి వారి శేష వస్త్రం, శేష మాలను సమర్పించగా, అనంతరం భక్తులకు తమ మంగళాశాసనాలను అందజేసి ఆశీర్వదించారు.
