మెడికల్ షాప్ ను సీజ్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్
ముద్ర, పెబ్బేరు : ఎక్స్పైరీ అయిన మెడిసిన్ విక్రయించే వారెవరికైనా చర్యలు తప్పవని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మి హెచ్చరించారు. ఇటీవల ఓ గర్భిణీకి కాలం చెల్లిన మందులు విక్రయించారని ఓ బాధితుడు ఆందోళన చేసిన విషయమై మంగళవారం ఆమె రాఘవేంద్ర హాస్పిటల్ను విజిట్ చేశారు. అక్కడున్న మెడికల్ షాపులో ఉన్న అన్ని మందులను చెక్ చేశారు. ఆ గర్భిణికి ఫుడ్ సప్లిమెంట్ కోసం ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ అయినవే ఇచ్చారని, అది కూడా పొరపాటున చూసుకోకుండా సిబ్బంది వాటిని విక్రయించారని హాస్పిటల్ నిర్వాహకులు ఒప్పుకున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

సాధారణంగా ఎక్స్పైరీ అయిన మందుల కోసం ఒక బాక్స్ ను మెయింటైన్ చేయాలని ఆ నిబంధనను వీరు పాటిస్తున్నారని చెప్పారు. ఎక్స్పైరీ అయిందంటే అలాంటి మందులు వాడకూడదని సూచించారు. ఈ హాస్పిటల్ వారు ఇచ్చిన ఆ మెడిసిన్ అంత ప్రమాదకరమైనదేమీ కాదని చెప్పారు. సివియర్ గా వచ్చే సమస్యలు ఏమీ రావని, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.
మెడికల్ షాపులో తనిఖీ చేసిన వివరాలన్నింటిని మహబూబ్నగర్ డ్రగ్స్ యూనిట్కు ఆన్లైన్లో నివేదించినట్లు చెప్పారు. వారం రోజుల పాటు మెడికల్ షాపును మూసివేస్తున్నామని అన్నారు. వారం రోజుల వరకు షాపును తెరవకూడదని, ఎలాంటి లావాదేవీలు జరపకూడదని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కఠినతరమవుతాయని చెప్పారు.