ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాల తీసుకువచ్చాము..
2026 – 27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం..
ధర్మపురిలో డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి:
ధర్మపురిని చదువుల నిలయంగా మార్చడానికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురికి మంజూరైన డిగ్రీ కళాశాల నూతన భవన స్థలాన్ని మంత్రి అధికారులతో కలిసి ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం ధర్మపురికి డిగ్రీ కళాశాల తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గారి మిత్రులైన రమేష్ గారు ధర్మపురిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు సహకరించారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అడిగిన వెంటనే ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు చేశారని మంత్రి తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరం నుండి ధర్మపురిలో డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నాలుగు కోర్సుల్లో 240 సీట్లు కేటాయించడం జరిగిందని మంత్రి అన్నారు. బీఏ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. నూతన డిగ్రీ కళాశాల తాత్కాలికం జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తామని, ఏడాదిలోకి పక్కా భవనం నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అడ్మిషన్లు పొందాలని మంత్రి కోరారు.
గతంలో ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ కళాశాల లేక దూరప్రాంతాలకు వెళ్లలేక చాలా మంది ఆడపిల్లలు ఇంటర్ తో చదువు నిలిపివేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏనాడు ప్రజల అవసరాలను గుర్తించలేదని, మేమే రాజులు, మేమే మంత్రులు అన్నాట్లు వ్యవహరించారని మంత్రి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కళాశాల తీసుకువచ్చా మని మిగిలిన బస్సు డిపో, రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం వంటి హామీలు త్వరలోనే అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ధర్మపురి డిగ్రీ కళాశాలకు మంజూరు అయిన కోర్సులతో పాటు స్థానికంగా ఉన్న యువతకు విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఓరియంటల్ కోర్సుల అనుమతికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ధర్మపురి లో బీఈడీ, బీపార్మాసీ, లా కాలేజ్ లు తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించి ధర్మపురిని చదువుల తల్లి నిలయంగా మార్చుతానని మంత్రి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలు 15 వార్డులకు 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో తమపై మరింత బాధ్యత పెరిగింది ని మంత్రి తెలిపారు. 2027 లో జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటికే అధికారులు సుమారు రూ. 944 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారని మంత్రి తెలిపారు. పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ధర్మపురిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి , వైస్ చైర్మన్ ఇందారపు రామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దినేష్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.