ముద్ర,రాయికల్: పీఆర్ టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కస్తూరి బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులకు ఆప్షనల్ సెలవులు మంజూరు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని, డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేతనాలు వెంటనే మంజూరు చేయాలని, బదిలీలు,ప్రమోషన్లు, చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధాన్నాన్ని పునరుద్దారించాలని పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని వెంటనే మంజూరు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బొమ్మకంటి రవికుమార్, పొన్నం రమేష్, గాజంగి రాజేశం,మాడిశెట్టి వినోద్,రాజ్ మహమ్మద్, జిల్లా బాధ్యులు గుర్రం శ్రీనివాస్, దొంతి సతీష్ మండల అసోసియేట్ అధ్యక్షులు కడకుంట్ల అభయ్ రాజ్, మండల కార్యదర్శి ఉషకోల రాము తదితరులు పాల్గొన్నారు.