ముద్ర ప్రతినిధి,నిర్మల్: బడుగు బలహీన వర్గాల్లో చైతన్య స్ఫూర్తి కలిగించేందుకు ప్రముఖ కవి రచయిత జూలూరి గౌరీ శంకర్ రచించిన “బహుజన గణమన” అనే దీర్ఘ కవిత సంపుటి పుస్తకాన్ని నిర్మల్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రముఖ కవి డా.దామెర రాములు మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో అభివృద్ధి సాధించినప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం సాక్షిగా అందరికీ సమాన ఫలాలు అందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయ కర్త డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ జనాభాలో సగం పైగా ఉన్నా బీసీలకు 50% రిజర్వేషన్లు అందినప్పుడే ఆర్థిక సామాజిక రాజకీయ పురోగతి సాధ్యమన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో బలహీనవర్గాలందరూ ఏకతాటిగా ఉద్యమించాలని పేర్కొన్నారు. మరో అతిధి తుమ్మల దేవరావ్ మాట్లాడుతూ జూలూరి గౌరీ శంకర్ సామాజిక చైతన్య స్ఫూర్తిగా దీర్ఘకావ్యాన్ని రచించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డా.వేణుగోపాల కృష్ణ, ఆరేపల్లి విజయ్ కుమార్, నేరెళ్ల హనుమంతు, అశోక్, సిరికొండ రమేష్, బిట్లింగ్ నవీన్, నాగోరావ్, బొంపాల చిన్నయ్య పోలీస్ భీమేష్, శనిగారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.