- చివరి దశకు చేరుకున్న ఆర్ఓబి పనులు.
రామకృష్ణాపూర్,ముద్ర : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 12 ఏళ్ల పాటు జరుగుతున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొన్నేళ్లుగా రైల్వే గేటు సమస్యతో ప్రాంత ప్రజలు పడ్డ కష్టాలు,ఇబ్బందులు అన్ని త్వరలోనే నెరవేరనున్నాయి. ఎన్నో ఏండ్ల కళ..నెరవేరుతున్న వేళ ప్రజలకు ప్రయాణ భారం ఇక సులభతరం కానుంది.చివరి దశకు వచ్చిన పనులను కాంట్రాక్టర్,అర్ అండ్ బి అధికారులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. రైల్వే బ్రిడ్జి పై డాంబర్ రహదారి పనులను చక చక చేపడుతున్నారు. పనులు పూర్తి కావడమే ఇక ఆలస్యం ప్రారంభానికి అంత సిద్ధం అంటున్నారు పట్టణ కాంగ్రెస్ లీడర్లు. ఏప్రిల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్న క్యాతన్ పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి.
- తీరనున్న రైల్వే గేటు సమస్య.
క్యాతన్ పల్లి గేటు సమస్య రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభంతోనే తీరనుందనీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు తెలిపారు. ప్రజల చిరకాల కోరిక అయినటువంటి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి త్వరలోనే నెరవేరనుంది.అందుకు సంబంధించిన పనులు చివరిదశకు చేరుకున్నాయి. స్థానిక కుర్మపల్లి గ్రామ ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జి పైకి ఎక్కేందుకు మెట్లను సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్,ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
- ప్రజల కష్టాలు తీరనున్నాయి.
ఈ ప్రాంత ప్రజల ప్రధాన సమస్య పరిష్కారం కొరకు నిత్యం ఆర్ అండ్ బి అధికారులు,కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే వివేక్,ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పనులను వేగవంతంగా పూర్తి చేయిస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి గుర్తు చేశారు. రైల్వే గేటు కారణంతో అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.ఎన్నో ఏళ్ల కష్టాలు ఒక రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జితో తీరనున్నాయి.త్వరలోనే ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది.
- విద్యార్థులకు,ఉద్యోగులకు ప్రయాణం సులభం.
స్కూల్,కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు,ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ద్వారా ప్రయాణం మరింత సులభతరం అవుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ చెప్పారు. నిత్యం స్కూల్,కాలేజీ,ఉద్యోగం,ఉపాధి కొరకు వెళ్ళే వారికి రైల్వే గేట్ ప్రధాన సమస్యగా మారిందన్నారు.చివరి దశకు చేరుకున్న బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. త్వరలోనే క్యాతన్ పల్లికి మంచి రోజులు రాబోతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
