ముద్ర, నారాయణ పేట:
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన దాడి దుర్మార్గమని నారాయణపేట జిల్లా బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు
ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కార్యాలయంపై దాడి సిగ్గు చేటన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.