ముద్ర ప్రతినిధి, భువనగిరి
భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల నుండి సనాతన ధర్మాన్ని, శివతత్త్వాన్ని, వేదమూల సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తోంది. ప్రతి యుగంలోనూ మహనీయులు, మహర్షులు మానవాళి శ్రేయస్సు కోసం దివ్య కర్మలను నిర్వహించారు. ఈ ధార్మిక సంప్రదాయానికి కొత్త దిశను చూపిస్తూ, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో రమణేశ్వరంలో మంగళవారం శత రుద్ర శివలింగాల ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు.
సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఈ సందర్బంగా మాట్లాడుతూ, పవిత్రమైన శ్రావణ మాసం శివారాధనకు అత్యంత శ్రేష్ఠమైనదని ఈ మాసంలో ఆగస్టు 13 నుండి 20 వరకు సాగిన మహోత్సవంలో, వేదఘోష, మంత్రనినాదం, అగ్నికుండాల జ్వాలలు, భక్తుల సమూహగానం కలిసిపోయి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయని చెప్పారు. చివరి రోజు ఆధ్యాత్మిక పరాకాష్ట మహోత్సవ ముగింపు ఘట్టం, శత రుద్ర శివలింగాల ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిగిందన్నారు. మహా పూర్ణాహుతి – యజ్ఞాగ్నికి పవిత్ర ద్రవ్య సమర్పణ, మండపారాధన, దేవత ఉద్వాసన యజ్ఞమండప దేవతలకు ముగింపు పూజలు చేసిన్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ – శివలింగాలలో దివ్య చైతన్య ఆవాహన, శివ కళాన్యాసం – శివతత్త్వంలోని దివ్య శక్తుల స్థాపన బలి ప్రదానం – సమస్త లోకాల క్షేమార్థం సమర్పణ గావించారు. నేత్రోన్మీలనం శివలింగాలకు దివ్య దృష్టి ప్రసాదం ఈ పూజా ఘట్టంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ దివ్య అనుభూతి పొందారని చెప్పారు.


భక్తుల పరవశం
ఈ పుణ్యకార్యంలో శివలింగ దాతలు ప్రధానంగా పాల్గొని, ప్రాణ ప్రతిష్ఠ, కళాన్యాసం సమయంలో అపూర్వ అనుభూతిని పొందారు.
“జన్మలో దక్కిన ఈ అరుదైన భాగ్యం మా జీవితానికి సార్థకతనిచ్చింది” అనే భావనతో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. విశ్వ శాంతికి సంకేతం శత రుద్ర శివలింగాల ప్రతిష్ఠా మహోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు.
ఇది మానవాళి శ్రేయస్సు, విశ్వశాంతి, ధర్మ పరిరక్షణ, భౌతిక – ఆధ్యాత్మిక సమన్వయం కోసం నిర్వహించబడిన యజ్ఞ ఘట్టం. ఈ కార్యక్రమం ద్వారా శివతత్త్వం మానవ లోకంలో మరింత బలంగా ప్రతిష్ఠింపబడింది. శివతత్త్వ ప్రసారం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి దివ్య సన్నిధిలో ఆవిష్కృతమైన ఈ శత రుద్ర శివలింగ ప్రతిష్ఠ, భవిష్యత్ తరాలకు శివపరమార్థ సాధనకు ఒక ప్రేరణా క్షేత్రంగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, ప్రపంచమంతా శివచైతన్యాన్ని ప్రసారం చేసే ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుగా మారింది.