Take a fresh look at your lifestyle.

మహారాష్ట్ర ఒప్పుకోనందుకే కాళేశ్వరం స్థలం మార్చాం

  • దైవ సాక్షిగా నిజమే చెప్తున్నా..!
  • కాళేశ్వరం కమిషన్​ ముందు హాజరైన హరీశ్ రావు.
  • ముందుగా ప్రమాణం.. ఆ తర్వాత విచారణ.
  • ప్రశ్నలకు కొన్ని ఆధారాలు ఇచ్చిన మాజీ మంత్రి.
  • 40 నుంచి 50 నిమిషాలు ప్రశ్నించిన ఘోష్​ కమిషన్.
  • ​ఓపెన్​ కోర్టులో విచారణ.
  • వివరాలు వెల్లడించిన హరీశ్​ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది.దాదాపు 40 నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది.వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా ముందుగా ఆయన ప్రమాణం చేశారు.ఓపెన్ కోర్టులో ఆయనను పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రధానంగా ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును  కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి హరీశ్ రావు సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు.అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని వివరించారు.ఆ సమయంలో మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్  పార్టీయే అధికారంలో ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.దాంతో తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావాడం కోసం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్‌కు వివరించారు.ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని అలాగే నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చిందన్నారు.అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని మూడు బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. అయితే స్థల మార్పు, రీడిజైన్ అనేది కొత్తగా చేపట్టిందేమీ కాదని, దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్‌లను రిడిజైన్ చేసి స్థలాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని మాజీ మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
  • విచారణ అనంతరం మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ,
తనకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. అందుకే నోటీసులు రాగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యానని అన్నారు. విచారణలో కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అన్నారు. కొన్ని అంశాలకు సంబంధించి తగు ఆధారాలు  కూడా సమర్పించినట్లు  ఆయన తెలిపారు.కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టే కాళేశ్వరం అని అన్నారు.  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా వేలాది ఎకరాలను సాగునీరు అందించామన్నారు.దాంతో వేలాది బంజరు భూములు, బీడు భూములను రైతులు సాగు చేసి పంటలు పండించారన్నారు.
  • స్థలం మార్పుపైనే ప్రధానంగా డిస్కషన్.
తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎందుకు మార్చారు,అనే అంశంపైనే కమిషన చాలాసేపు విచారించిందన్నారు.దానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా అన్ని రకాల ప్రయత్నం చేశామని చెప్పినట్లు హరీశ్ రావు వెల్లడించారు.  రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన నెల రోజలకే మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముషారఫ్ ని కలిశామన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని కానీ మహరాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నారు. ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళిటనట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు సమావేశాలు జరిగాయన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగిందన్నారు. అప్పుడు స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర కు వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బిజెపి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ని కలిశామన్నారు.అనేక విధాలుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారన్నారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని పడ్నవీస్ తేల్చి చెప్పారన్నారు.కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 7 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదన్నారు. ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదన్నారు.దాని కోసం ఒక గుంట భూమిని కూడా సేకరించలేదన్నారు.అదే సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.ఆ లేఖలో తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసిందన్నారు.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరారని  కమిషన్ కు చెప్పినట్లు హరీశ్ రావు వెల్లడించారు.కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపిందన్నారు. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్నారు.
ఇక కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందా? అన్న విషయంపై ఆధారాలతో సమర్పించడం జరిగిందన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి కూడా కమిషన్ అడిగిందన్నార. అయితే ఇది పూర్తిగా టెక్నికల్ నిర్ణయమని ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారిందన్నారు.ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పానని అన్నారు. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ కి సమర్పించడం జరిగిందన్నారు.ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని కమిషన్ అడిగిన ప్రశ్నకు కూడా సమగ్రంగా సమాధానం ఇచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించామని చెప్పడం జరిగిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు 21 పంప్ హౌజులు,203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్,141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్క, 240 టిఎంసీల నీటి వినియోగం పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని చెప్పినట్లు  హరీశ్ రావు  పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు.ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోతాయన్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని, హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తరలిస్తామంటున్నారన్నారు.అదేవిధంగా హైదరాబాద్ కు తాగునీటిని మల్లన్న సాగర్ నుంచి ఇస్తామంటున్నారని ఇదంతా కాళేశ్వరంలో భాగమేనని అన్నారు.
  • కమిషన్ వేసిన ప్రశ్నలు ఇవే..
జీవో 115 ప్రకారం వేసిన మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది? అని కమిషన్ ప్రశ్నించగా, రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించాలనే లక్ష్యంతో స్టడీ కోసం అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని హరీశ్ రావు చెప్పారు.ఈకమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ పాటు తాను ఉన్నానని అన్నారు. అయితే సిడబ్ల్యుసి, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్నారు. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చామన్నారు 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. సీడబ్ల్యుూసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచామన్నారు. మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు.వ్యాప్కోస్ నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాం. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రిపోర్టులు ఇచ్చిందన్నారు.
కమిషన్: అన్నారం సుందిళ్ళ లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా ?
హరీష్‌ రావు: లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్.టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా లొకేషన్స్ మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్‌లు మారాయన్నారు.
కమిషన్: ప్రాజెక్టుల లొకేషన్‌లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా?
హరీష్‌ రావు: అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది .
కమిషన్: కాలేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి?
హరీష్‌ రావు: లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
కమిషన్: కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు?
హరీష్‌ రావు: నీళ్లను అమ్మి లోన్లను రీ పేమెంట్ చేయాలి అనుకున్నాము.
కమిషన్: కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు?
హరీశ్ రావు: కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది. అప్పటికే మెదక్‌లో కోకాకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయి.
కమిషన్: నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు?
హరీశ్ రావు: సాధారణంగా అప్పటి పరిస్థితులు ఆధారంగా సైట్స్ కొంత డిలే అవుతాయి.
కమిషన్: మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వొచ్చు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా?
హరీశ్ రావు: డైరెక్ట్‌గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది.
కమిషన్: బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా?
హరీశ్ రావు: టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు.
కమిషన్: కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజీ చేశారు ?
హరీశ్ రావు: రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం.
కమిషన్: బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ?
హరీశ్ రావు : టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.
కమిషన్: బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?
హరీశ్ రావు: బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదని సమాధాన మిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.