Take a fresh look at your lifestyle.

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు  ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 

రబీ సీజన్ కి సంబంధించి వరి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం మినీ మీటింగ్ హల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో-ఆపరేటివ్, మిల్లర్లు తదితర శాఖల అధికారులతో రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్  సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలన్నారు. అన్ని కేంద్రాల్లో ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా త్రాగునీరు కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కేంద్రాలకు ఏ రోజు వచ్చే ధాన్యం అదే రోజు కొనుగోలు జరిగి, అదేరోజు  మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్లు  లోడింగ్ ధాన్యం ను వెంటనే తీసుకోవాలన్నారు.

ధాన్యం కొనుగోలుకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే టార్ఫాలిన్లు, ధాన్యాన్ని తూర్పార పట్టే యంత్రాలు, గన్నీ సంచులు,  వెయింగ్ మెషీన్ లు, తదితరాలు పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాలలో సరిపడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలన బృందాల చే ఆకస్మిక తనిఖీలు చేపట్టి కొనుగోలు ప్రక్రియ ను పర్యవేక్షణ చేయాలన్నారు

ఈ సమావేశంలో  రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,సివిల్ సప్లై మేనేజర్ హరి కృష్ణ, జిల్లా గ్రామీణ  అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, సివిల్ సప్లై అధికారి రోజారాణి, జిల్లా వ్యవసాయ  అధికారి రమణ రెడ్డి, జిల్లా తూనిక, కొలతల అధికారి వెంకటేష్, జిల్లా కోపరేటివ్ అధికారి మురళి, మిల్లర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.