Take a fresh look at your lifestyle.

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చునని, రైతులు సాంప్రదాయ పంటల నుండి లాభసాటి కూరగాయల సాగువైపు మళ్లడం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతారని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సాంప్రదాయ పంటలు తగ్గించి కూరగాయల వైపు దృష్టి సారించాలని కోరారు. కూరగాయల పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందన్నారు.
మంగళవారం టేక్మాల్ మండలం చంద్రు తండాలో కలెక్టర్ పర్యటించారు. 256 మంది రైతులు పండిస్తున్న లాభసాటి కూరగాయల సాగును పరిశీలించి. రైతులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైతు కష్టాన్ని నమ్ముకుని పనిచేస్తారని, రైతే దేశానికి వెన్నుముక అనే నినాదానికి నిదర్శనంగా చంద్రు తండా నిలుస్తుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ లాభసాటి కూరగాయల పెంపకంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు. టమాటా, కాకర, చిక్కుడు, సొరకాయ సేంద్రీయ ఎరువులతో పెంచడంతోపాటు, తోటలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పెరగడం నాణ్యత గల కూరగాయలు రైతులే స్వయంగా మార్కెట్ కు తీసుకుని వెళ్లి వ్యాపారం నిర్వహించుకుని లాభాలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ రూపంలో స్ప్రింక్లర్స్ అందించడం జరిగిందని అదేవిధంగా వ్యవసాయ అధికారులు రైతులకు కూరగాయల సాగుకు సంబంధించిన మెళకువలు అందించడం ద్వారా ఆర్థిక చేయూత కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సర్పంచి స్రవంతి సర్దార్, మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఏఈఓ వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జనగణన ప్రక్రియలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర కీలకం
టేక్మాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సెన్సెస్ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు.
ఫీల్డ్ సిబ్బందికి జనగణన ప్రక్రియ, నియమాలు, బాధ్యతలపై అవగాహన కల్పించడం, డేటా సేకరణను సక్రమంగా నిర్వహించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. జన గణనలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పాత్ర కీలకమని, 34 పాయింట్లను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని కలెక్టర్ సూచించారు. సందేహాలుంటే అడగాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యతోపాటు సామాజిక అంశాల్లో అవగాహన కల్పించాలి
విద్యతోపాటు సామాజిక అంశాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలలో రెండవ రోజు టేక్మాల్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ లో ఎంపీడీవో, ఎంఈఓతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ వసతి గృహంలోని స్టోర్ గది కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ
చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను సృజనాత్మకతలను వెలికి తీయడం, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలు వివిధ సబ్జెక్టులలో జ్ఞానాన్ని, శీఘ్ర ఆలోచనా విధానాన్ని పరీక్షించడం కోసం క్విజ్ పోటీలు, బాలల హక్కుల, కార్యక్రమాలు, బాలల హక్కులు, విద్య, ఆరోగ్య అవగాహనపై వీధి నాటకాలు, సామాజిక న్యాయం, విద్య, పర్యావరణం – ఆంగ్లంలో, తెలుగులో చర్చ ప్రసంగాలు సామాజిక న్యాయ, ప్రకృతి, సంస్కృతి అంశాలపై సృజనాత్మక వ్యక్తీకరణ పై డ్రాయింగ్, పెయింటింగ్ తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రియా యాయుద్దీన్, పంచాయితీ సెక్రెటరీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.