- కూంబింగ్ ఆపండి.
- కర్రిగుట్టల వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తున్నది.
- ఆపరేషన్ కగార్ ను నెల రోజుల వరకు వాయిదా వేయండి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టుల విజ్ఞప్తి.
- బస్తర్ మావోయిస్టు ఇన్ చార్జి రూపేశ్ పేరిట లేఖ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో జరుగుతోన్న భద్రత బలగాల కూంబింగ్ ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సాయుధ బలగాలు వేల సంఖ్యలో కర్రిగుట్టలను చుట్టు ముట్టడంతో అక్కడ యుద్ధవాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కర్రిగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపి శాంతి చర్చలకు ముందుకురావాలంటూ బస్తర్ మావోయిస్టు ఇన్ చార్జి రూపేశ్ పేరుతో శుక్రవారం ఓ ప్రకటన విడుదలయింది.ఇందులో రూపేశ్..శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. శాంతి చర్చల విషంలో మా పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు కూడా జారీ చేసిందని చర్చల విషయంలో మా వైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని చర్చల ద్వారా సమస్య పరిష్కిరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైందన్నారు.వెంటనే ఈ ఆపరేషన్ ఆపి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల కోసం అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. ఆపరేషన్ కగార్ నెల రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.