- బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
- సీఎం హోదాలో కోర్టుకు హాజరుకాలేరన్న రేవంత్ తరపు న్యాయవాదులు.
- వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన కోర్టు
ముద్ర, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది.ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.అయితే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారిక కార్యక్రమాల కారణంతో కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం తదుపరి విచారణను కొనసాగించనుంది.
- వివాదమిదే..
గతేడాది మే 5న కొత్తగూడెంలో జరిగిన ‘జన జాతర’ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఫేక్ వీడియోను సృష్టించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆయన ఆరోపించారు.ఈ ఫిర్యాదుపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది.ఈ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. దాంతో రేవంత్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది.