వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడండి. నగరపాలక సంస్థ,వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయం తో పనిచేయాలి
- అదనపు కలెక్టర్ అరుణశ్రీ.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని:వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణశ్రీ అన్నారు.సోమవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మునిసిపల్ ప్రజారోగ్యవిభాగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బందితో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటింటిని సందర్శించి జ్వర సర్వే నిర్వహించాలని అన్నారు.సర్వే నిర్వహించే సందర్భంలో పారిశుధ్య సమస్యలు దృష్టికి వస్తే నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం దృష్టికి తీసురావాలని అన్నారు.సమన్వయం కొరకు ఇరు విభాగాల సిబ్బంది ఫోన్ నెంబర్ లతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలనిఆదేశించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మలేరియా,డెంగ్యూ అనుమానిత కేసులు వచ్చినప్పడు మునిసిపల్ సిబ్బందికి వారి నివాస సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి అంటువ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా సీజనల్ వ్యాధుల నియంత్రణపై కూడా దృష్టిసారించి త్రాగు నీటి క్లోరినేషన్,నిలువ ఉన్న నీరు తొలగించడం,బ్లీచింగ్, స్ప్రెయింగ్,ఫాగింగ్,ఆయిల్ బాల్స్ వదలడం వంటి అనేక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ అంటువ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు.నివాసాల మధ్యలో అపరిశుభ్రత నెలకొన్న పరిసరాల వివరాలను మునిసిపల్ సిబ్బంది కి అందించాలని సూచించారు. నగర పాలక సంస్థ,వైద్య ఆరోగ్య శాఖ సమష్టిగా పని చేసి ఈ వర్షా కాలంలో అంటువ్యాధులు విజృభించకుండా అరికట్టేందుకు కృషి చేద్దామని అన్నారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి,పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యులు మానికేశ్వర్ రెడ్డి,సాదిక్ పాషా, అహల్య, పద్మ, రమణి ,దీవెన,స్నేహాలత, నగరపాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం,కిరణ్,కుమార స్వామి, జూనియర్ అసిస్టెంట్ శంకర్, స్వామి,మెప్మా టి ఎం సి మౌనిక, సానిటరీ జవాన్లు పాల్గొన్నారు.